అచ్చెన్నాయుడిపై చర్యలకు ఆదేశించింది నిమ్మగడ్డనే , టీడీపీ విమర్శలు హాస్యాస్పదం : మంత్రి ధర్మాన కృష్ణదాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో రసవత్తరంగా మారుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెదిరింపుల పర్వాలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఏపీ ఎన్నికల పంచాయతీ తీవ్ర ఆరోపణలకు వేదికగా మారింది.
టీడీపీ విమర్శలకు సమాధానం చెప్పిన ధర్మాన కృష్ణ దాస్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలిచే సత్తా లేదని, అందుకే ఎన్నికలంటే భయపడుతున్న వైసిపి, ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసి, ప్రతిపక్ష పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నంలో ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు టిడిపి నేతలు. ఇదే సమయంలో అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిని వైసిపి ప్రభుత్వ కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు. అయితే టిడిపి విమర్శలకు సమాధానం చెప్పారు మంత్రి ధర్మాన కృష్ణదాస్.
అచ్చెన్నాయుడు పై చర్యలు తీసుకోమని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామం అయిన నిమ్మాడలో దౌర్జన్యానికి పాల్పడ్డారని, కింజారపు అప్పన్నను భయభ్రాంతులకు గురిచేశారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. టిడిపి నేతలు అనవసరంగా వైసీపీ పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ అచ్చెన్నాయుడు పై చర్యలు తీసుకోమని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారని, ఆయన ఆదేశాల మేరకే అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిందంటూ పేర్కొన్నారు మంత్రి ధర్మాన కృష్ణదాస్.
అచ్చెన్నాయుడు వ్యవహార శైలి సరైంది కాదన్న మంత్రి ధర్మాన కృష్ణ దాస్
ఎన్నికలకు వైసీపీ భయపడితే అని పేర్కొన్న ఆయన టిడిపి నేతలు దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అచ్చెన్నాయుడు పోలీసులను సైతం భయబ్రాంతులకు గురి చేస్తూ వారి అంతు చూస్తాం అని మాట్లాడుతున్నారు అంటూ ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. అచ్చెన్నాయుడు వ్యవహార శైలి సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. వైసీపీపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్న ధర్మాన కృష్ణదాస్ స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి టిడిపి నేతలు సహకరించాలని పేర్కొన్నారు.