ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు గెలిస్తే ఎంత? ఓడితే ఎంత?
ఎన్నికల్లో గెలుపు, ఓటములపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఎన్నికల్లో జయాపజయాలకు సంబంధించి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన కొందరు యువత వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడంతోపాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మాన ప్రసాదరావు ఓడిపోతే కొంపేమీ మునిగిపోదని, ఆయన గెలిస్తే ఎంత? ఓడిపోతే ఎంత? అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వల్ల సమాజంలో వస్తున్న మార్పులను యువత గుర్తించాలని సూచించారు. సమాజాన్ని నడిపించే శక్తి, బలం ఉన్న యువకులు ముందుకు రావాలని, కొందరికీ వైసీపీ అంటే అవగాహన లేదని, పలువురు వైశ్యులు బీసీల్లో కలపమని అడిగారని చెప్పారు. తాను క్యాబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో కమిషన్ రికమెండేషన్ పెట్టించానని, తర్వాత ప్రభుత్వం బీసీల్లో కలిపిందన్నారు. కానీ ప్రయోజనం చేసినవారికి నష్టం చేస్తున్నారన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దేశంలో అక్షరం ముక్కరానివారున్నారని, మన ఏపీలో విద్యా విధానం అద్భుతంగా అమలవుతోందని కొనియాడారు. విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం జరిగిందని, ఇవన్నీ ఓట్ల కోసం చేసేవి కావన్నారు.

సమాజంలో వ్యక్తుల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించే పని ప్రభుత్వాలు చేయాలని, అదే పనిని జగన్ ప్రభుత్వం చేస్తోందని ధర్మాన చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యాపార సంస్థ మీద దాడిచేసేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంలేదని, అయినా వ్యాపార కమ్యూనిటీ వ్యతిరేకంగా ఉందన్నారు. వ్యాపారులు గుండెలమీద చేయి వేసుకొని నిజాలు చెప్పాలన్నారు. తమ ప్రభుత్వంలో లంచాలు కూడా లేవన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే రాజకీయ నేతల పని అని, తెస్తున్న మార్పులను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు.












Click it and Unblock the Notifications