పాదయాత్ర పేరుతో దండయాత్ర.. చితక్కొడతాం
అమరావతి రైతులు పాదయాత్ర చేసేది ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకేనని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సమన్వయ కర్త, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. వైజాగ్ ను రాజధానిగా ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంత వాసులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. పాదయాత్ర పేరుతో దండయాత్రకు వస్తున్న రైతులను పాదయాత్రను అడ్డుకోవాలంటూ ఆయన వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గానికి అడారి ఆనంద్ కుమార్ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని సుబ్బారెడ్డి ప్రారంభించారు.
పాదయాత్ర పేరుతో దండయాత్ర
పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రపై దండయాత్రకు రావడం ఎంతవరకు సబబని, వైజగ్ అభివృద్ధి అంటే ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిలో మైలు రాయిగా ఉంటుందని సుబ్బారెడ్డి అన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటే రూ.లక్షల కోట్లు కావాలని, ఇప్పుడు అది సాధ్యపడదని తేల్చిచెప్పారు. సంక్షేమం కోసం రాష్ట్రంలో వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలంతా అభివృద్ధి కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఆశయమన్నారు. అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదని, ఆ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని, వారందరినీ నిలువరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆనంద్ కుమార్, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితర నేతలు పాల్గొన్నారు.
రాజకీయంగా చితక్కొట్టాలి?
శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటైతే మనందరి భవిష్యత్తు బాగుంటుందని, దీనికోసం మనమెవరం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని, అందరూ ముక్త కంఠంతో మాట్లాడితే చాలని ధర్మాన సూచించారు. మా పీక కోసేందుకు అమరావతి నుంచి అరసవెల్లికి వస్తున్నారా? మా ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? విశాఖపట్నంను రాజధానిగా ఏర్పాటు చేసే క్రమంలో అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలని మంత్రి వ్యాఖ్యానించారు.
రైతులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 29 గ్రామాల పరిధిలోని రైతులు అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో 60 రోజుల పాదయాత్రను గత నెల 12వ తేదీన ప్రారంభించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలమీదగా సాగిన ఈ యాత్ర ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేసేవారు రైతులు కాదని, ఫేక్ యాత్రికులంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై రైతులు స్పందిస్తూ తమ ఆధార్ కార్డులు, ప్రభుత్వానికి భూములిచ్చిన పత్రాలను చూపించారు.