ముద్రగడపై గంటా సంచలనం, పవన్ కళ్యాణ్! మోడీ వద్దకెళ్లు: వీహెచ్
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పైన మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తునిలో విధ్వంసానికి దిగి క్రిమినల్స్గా రికార్డుకెక్కిన వారి పైన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న ముద్రగడను కూడా క్రిమినల్గానే భావించవలసి ఉంటుందన్నారు.
ఆయన కడప జిల్లాలో మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ చేసిన కాపు యువకుల పైన కేసు ఎత్తివేయాలన్న ముద్రగడ డిమాండు పైన గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైన వారంతా అమాయకులైతే, విధ్వంసానికి పాల్పడిన వారు ఎవరో చెప్పాలన్నారు. ముద్రగడ కాపు జాతికి నష్టం చేస్తున్నారన్నారు.
తుని ఘటనలో కేసులు ఎత్తివేసే ప్రసక్తి లేదు
తుని విధ్వంస ఘటనలో కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ముద్రగడ డిమాండ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. అమాయకుల పైన కేసులు ఎట్టి పరిస్థితుల్లోను ఉండవని ఆయన తెలిపారు.
సాక్ష్యాల ఆధారంగానే సీఐడీ విచారణ చేసి, అరెస్టు చేసిందని చెప్పారు. మొదట తీవ్ర నేరారోపణ ఉన్న వారినే అరెస్టు చేస్తారని, రౌడీ షీట్రలను ముద్రగడ ఎలా సమర్థిస్తారని ఆయన ప్రశ్నించారు. వైసిపి చీఫ్ జగన్కు ముద్రగడ తొత్తుగా మారారని ఆరోపించారు.
జగన్ చేతిలో కీలుబొమ్మ: రామానాయుడు
ముద్రగడ పద్మనాభం వైసిపి అధినేత జగన్ చేతిలో కీలుబొమ్మగా మారారని ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. వైసిపికి ముద్రగడ రహస్య ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసానికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తే భయమెందుకని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ మౌనం వీడు: వీహెచ్
కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న కాపు ఐక్యవేదిక, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతవీ హనుమంత రావు మద్దతుగా నిలిచారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో కాపుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవేనన్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లేని పక్షంలో కాపుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం ఖాయమన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇకనైనా కాపు ఉద్యమం గురించి మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. కాపులకు న్యాయం చేసేందుకు పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టాలన్నారు. పవన్ కళ్యాణ్ తన మౌనం వీడి ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాలన్నారు. కాపుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ఏపీ ప్రభుత్వం కేసులు బనాయిస్తోందన్నారు. ఉద్యమాన్ని అణచివేస్తే సహించేది లేదన్నారు.