అయ్యన్నకు లోకేష్, బాలయ్య మద్దతు: అసంతృప్తి, గంటాకు ఎసరు?
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్ని వైపుల నుంచీ సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల చేయించిన సర్వేలో కూడా గంటా శ్రీనివాస రావుకు సరైన మార్కులు పడలేదని అంటున్నారు. ఆయన పనితీరు పట్ల కూడా చంద్రబాబు తీవ్ర ఆసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
విశాఖపట్నం జిల్లాలో ఆయన అయన్నపాత్రుడు వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. చంద్రబాబు అసంతృప్తి, సర్వేలో దిగదుడుపు పలితం వంటి అంశాలకు అయన్నకు టిడిపి యువ నేత నారా లోకేష్ మద్దతు తోడై గంటా శ్రీనివాస రావు పదవికి ఎసరు పెట్టవచ్చునని భావిస్తున్నారు.
త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో గంటా వర్గంలో గుబులు రేగుతోంది. చంద్రబాబు బావమరిది, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలకృష్ణ కూడా అయ్యన్నపాత్రుడి వైపే ఉన్నట్లు చెబుతున్నారు. ఇది కూడా గంటాకు మైనస్ కానుంది.
కీలకమైన విషయాల్లో గంటా స్వతంత్రంగా వ్యవహరించడం కూడా చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంతో చోటు చేసుకున్న వివాదాల పరిష్కారంలో ఆయన చొరవ చూపలేదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఉన్నత విద్యామండలి, ఎంసెట్, తాజాగా అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వంటి విద్యాశాఖకు చెందిన అన్ని వ్యవహారాల్లో రాష్ట్రం మాట చెల్లుబాటు కాకపోవడానికి గంటా వైఫల్యమే కారణమని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు, నేరుగా ఉపాధ్యాయులను బదిలీ చేస్తామని గంటా చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేశాయి. దాంతో చంద్రబాబు జోక్యం చేసుకుని, కౌన్సెలింగ్ ద్వారానే బదిలీ చేస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఉదంతంపై కూడా గంటా శ్రీనివాస రావు సరిగా స్పందించలేదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. బోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ అంశంలో గంటా తీరుపై అయన్నవర్గం నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. ఈ స్థితిలో గంటాను సమస్యలు చుట్టుముట్టినట్లు అర్థమవుతోంది.