అసభ్యకరంగా మాట్లాడిన మంత్రి, తప్పేనని అంగీకరించిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఉద్దేశించి జగీశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, అవి సరికాదని మాజీ మంత్రి జానా రెడ్డి అన్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
దీనిపై కేసీఆర్ స్పందించారు. తాను ప్రత్యక్షంగా చూడలేదని, ప్రయాణంలో ఉన్నానని, జగదీశ్వర్ రెడ్డి అలా మాట్లాడితే తప్పేనని కేసీఆర్ అన్నారు. జగదీశ్వర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పే అన్నారు. సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు. సభను సజావుగా జరుపుకుందామని కోరారు.

తాను సభలో లేనని, ఏమన్నారో తెలియదని, ఫుటేజీ చూశాక ఆ వ్యాఖ్యలు తప్పైతే సభాపతి ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. జగదీశ్వర్ రెడ్డి కూడా తన వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. అదే సమయంలో జగదీశ్వర్ రెడ్డి ఎందుకు వ్యాఖ్యానించారో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాము తప్పులు చేస్తే నిలదీయవచ్చునని, జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ పైన ఇష్టారీతిన ఆరోపణలు చేస్తామంటే ఊరుకోమన్నారు. తమ ఆత్మకు సంబంధించి న్యాయంగా పోతున్నామని, అవినీతికి దూరంగా ఉంటున్నామని చెప్పారు.
జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్దేశ్యపూర్వకంగా మాట్లాడలేదని, అయినా అలాంటి పదాలు వాడటం తప్పు కాబట్టి తాను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. కాగా, అసభ్యంగా మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న అనంతరం సభ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications