శాఖ నాది, నీ తండ్రి ఉన్నప్పుడు అలా కావొచ్చు: జగన్కు మంత్రి జవహర్
ఎక్సైజ్ శాఖ తనది అని, తాను స్వేచ్ఛగా నిర్వహిస్తున్నానని, ఇందులో ఎవరి నియంత్రణ లేదని మంత్రి జవహర్ స్పష్టం చేశారు. మద్యం విధానంపై వైసిపి అధినేత జగన్ అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
అమరావతి: ఎక్సైజ్ శాఖ తనది అని, తాను స్వేచ్ఛగా నిర్వహిస్తున్నానని, ఇందులో ఎవరి నియంత్రణ లేదని మంత్రి జవహర్ స్పష్టం చేశారు. మద్యం విధానంపై వైసిపి అధినేత జగన్ అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
అందుకు ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను దళితుడిననే చులకన భావంతో ఆత్మగౌరవంపై దెబ్బగొడితే రెట్టింపు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.

నా శాఖలో ఎవరి ప్రమేయం లేదు
బార్లకు అయిదేళ్లపాటు పొడిగింపు ఇచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సవరించుకునే అవకాశముంటుందని తెలుసుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని జవహర్ ఎద్దేవా చేశారు. తన శాఖను తాను స్వేచ్ఛగా నిర్వహిస్తున్నానని, ఇందులో ఎవరి ప్రమేయం లేదన్నారు.

శాఖ నాది.., వైయస్ ఉన్నప్పుడు అలా కావొచ్చు
శాఖ నాదని, నిర్ణయాలు నావి అని, మంత్రిమండలికి వెళ్లకుండా ఏదీ అమలు కాదని చెప్పారు. జగన్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని శాఖలు వైయస్ రాజశేఖర రెడ్డి నియంత్రించేవారేమోనని, అందుకే ఇలా మాట్లాడుతున్నారన్నారు.

జగన్ తీరు సిగ్గుచేటు
ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్న ప్రతిపక్ష జగన్ విశాఖపట్నం భూముల వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని మహా ధర్నాకు పిలుపునివ్వడం సిగ్గుచేటు అని, ఆయనకు ఆ అర్హత లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా అన్నారు.

విశాఖ భూములపై పారదర్శకంగా విచారణ
11 సీబీఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్, ఈడీ అటాచ్మెంట్ చేసిన రూ.2,524 కోట్ల తన ఆస్తులను ప్రభుత్వానికి ఎందుకు అప్పగించలేదని సోమిరెడ్డి ప్రశ్నించారు. విశాఖ భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications