బెల్ట్ షాపులన్నీ మూయించాం: ఎక్సైజ్ శాఖకు టార్గెట్ లేదు
రాష్ట్రంలో 100 శాతం బెల్ట్ షాపులు మూయించామని ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి కె.ఎస్.జవహర్ చెప్పారు.
అమరావతి: రాష్ట్రంలో 100 శాతం బెల్ట్ షాపులు మూయించామని ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి కె.ఎస్.జవహర్ చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో బెల్ట్ షాపుల అంశం ప్రస్తావించారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్రంలో 680 బెల్ట్ షాపులను మూయించామన్నారు.
ఎక్కడైనా బెల్ట్ షాపు ఉంటే, ఆ సమాచారం తనకు గాని, 1100 నెంబర్ కు గానీ ఇస్తే అర్ధగంటలో మూయిస్తామని చెప్పారు. ఎక్సైజ్ శాఖ టార్గెట్ లేకుండా పని చేస్తుందని, ఆదాయంపై సమీక్షలు కూడా చేయడంలేదన్నారు.
రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తున్నామని, 11 మండలాల్లో 19 లక్షల గంజాయి మొక్కలు ధ్వంసం చేసినట్లు తెలిపారు. శాసనసభలో బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించిన కల్తీ లిక్కర్ అంశం విలేకరులు ప్రస్తావించగా, అటువంటి షాపులు ఉంటే సీజ్ చేయిస్తామని మంత్రి చెప్పారు.