చంద్రబాబు, లోకేష్ పాత్ర ఉంది?
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంలో చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పాత్ర కూడా ఉందని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. వారిద్దరికీ నోటీసులివ్వాలన్నారు. జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేయడానికి కృషి చేస్తుంటే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్ స్కాంకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు.
తమ ప్రభుత్వం గడప గడపకు వెళుతోందని, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని, అక్రమాలను ప్రజలవద్దకు తీసుకువెళుతున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ రాజకీయ భవితవ్యం ఈ ఎన్నికలతోనే ముగిసిపోతోందన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంలో ఈడీ అధికారులు దూకుడుగా పనిచేస్తున్నారు. తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ పలవురికి నోటీసులు జారీచేశారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల ప్రతినిధులను ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. ఈడీ దాడులు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. గత ప్రభుత్వం సీమెన్స్ సంస్థతో రూ.3350 కోట్ల ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు గుర్తించగా సీమెన్స్ 90 శాతం నిధులు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం పది శాతం నిధులను విడుదల చేయాలనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.