సత్యకుమార్ టీడీపీనా - బీజేపీనా : మరోసారి మాట్లాడితే - మంత్రి జోగి రమేష్ హెచ్చరిక..!!
బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ తాజాగా ఏపీలో వైసీపీ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సత్యకుమార్ వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. మంత్రి జోగి రమేష్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. సత్యకుమార్ పైన పైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం - సీఎం జగన్ గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని బీజేపీ నేత సత్యకుమార్ను మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. అసలు ఈ రాష్ట్రంలో సత్యకుమార్ అనే వ్యక్తిని ఎవరైనా గుర్తుపడతారా అని ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉన్నాయా అంటూ మంత్రి జోగి రమేష్ నిలదీసారు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కితే ప్రతి గడపకూ, ప్రతి రైతు కుటుంబానికీ, ప్రతి అక్కచెల్లెమ్మకూ సంక్షేమ సాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందన్నారు. ఆయన మాటలు చూస్తుంటే.. అసలు ఆ వ్యక్తి బీజెపి కార్యదర్శా..? లేక టీడీపీ కార్యదర్శా అనే అనుమానం కలుగుతుందన్నారు.

సత్య కుమార్ అనే వ్యక్తి అసత్య కుమార్గా మారి అబద్ధాలు ప్రచారం చేస్తూ, తద్వారా మరెవరికో రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సత్యకుమార్ చూసారా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి బీజేపీ నేర్చుకోవాలన్నారు. సంక్షేమం చూసి ఓర్వలేక, సత్య కుమార్ లాంటి వారు చేస్తున్న అసత్య, అసందర్భ పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎజెండాతో సత్యకుమార్ అసత్యాలను, అవాస్తవాలు ప్రచారం చేసి ప్రభుత్వంపై బురదచల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. మరొకసారి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే సత్యకుమార్ కి తగిన శాస్తి జరుగుతుందని మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. సత్యకుమార్ లాంటి వారికి ప్రజలు సరైన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications