చంద్రబాబుకు నమ్మిన వ్యక్తి, అదృష్టం వెతుక్కొంటూ వస్తోంది, ఎవరా మంత్రి?
ఏపీ సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు అదృష్టవంతుడనే ప్రచారం టిడిపి వర్గాల్లో ఉంది.ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాదు మంత్రి బాధ్యతలను దక్కించుకొన్నారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులుకు అదృష్టం దరిద్రం పట్టుకొంటున్నట్టుగా ఉందనే ప్రచారం సాగుతోంది. సాదాసీదా జర్నలిస్టుగా ఉన్న కాలువ శ్రీనివాసులు చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ప్రస్తుతం కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సీనియర్ నేతలకు కాదని కూడ అనంతపురం జిల్లా నుండి కాలువ శ్రీనివాసులుకు మంత్రివర్గంలో చోటుదక్కింది.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తటస్థులకు , మేధావులను పార్టీలోకి ఆహ్వనించారు. ఈ ఆహ్వనం మేరకు అప్పటివరకు జర్నలిస్టుగా ఉన్న కాలువ శ్రీనివాసులుకు టిడిపిలో చోటు దక్కింది.1998-99 సమయంలో అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు.
కాలువ శ్రీనివాసులు బోయ సామాజికవర్గానికి చెందినవాడు. కాలువ శ్రీనివాసులుకు ఆయన సామాజికవర్గం కలిసివచ్చింది. అనంతపురం జిల్లాలో బోయ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో బోయ సామాజికవర్గం ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపిస్తాయి.
చివరినిమిషంలో రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన కాలువ శ్రీనివాసులు విజయం సాధించారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి టిడిపి ఇంచార్జీగా ఉన్న దీపక్రెడ్డిని కాదని కూడ చంద్రబాబునాయుుడు 2014లో కాలువ శ్రీనివాసులుకు టిక్కెట్టును కేటాయించారు.
వరుస ఓటముల నుండి గెలుపు దిశగా
తొలిసారి అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించిన కాలువ శ్రీనివాసలుు ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయితే 2014లో మాత్రం పార్లమెంట్ స్థానానికి పోటీచేయకుండా రాయదుర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేశారు. అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా జెసి దివాకర్రెడ్డి పోటీచేశారు. దీంతో రాయదుర్గం అసెంబ్లీ సీటు కాలువ శ్రీనివాసులుకు పోటీచేసే అవకాశం దక్కింది. ఈ స్థానం నుండి కాలువ శ్రీనివాసులు టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు.
పల్లె రఘునాథరెడ్డిని తప్పించి మంత్రివర్గంలోకి
2014లో అనంతపురం జిల్లా నుండి పల్లె రఘునాథరెడ్డికి, పరిటాల సునీత చంద్రబాబునాయుడు మంత్రి పదవులను ఇచ్చారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ సందర్భంగా చంద్రబాబునాయుడు పల్లె రఘునాథరెడ్డిని తప్పించి కాలువ శ్రీనివాసులుకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అప్పటివరకు ప్రభుత్వ చీఫ్ విప్గా కాలువ శ్రీనివాసులు కొనసాగారు.అయితే అదే చీప్ విప్ పదవిని పల్లె రఘునాథరెడ్డికి కట్టబెట్టారు.
సీనియర్లను కాదని మంత్రి పదవి దక్కింది
అనంతపురం జిల్లాలో సీనియర్ టిడిపి ఎమ్మెల్యేలను కాదని చంద్రబాబునాయుడు కాలువ శ్రీనివాసులుకు మంత్రి పదవిని కట్టబెట్టారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో సీనియర్ నేత, పెనుకొండ ఎమ్మెల్యే బి.కె. పార్థసారథికి అవకాశం దక్కుతుందని భావించారు. మైనారిటీ కోటా నుంచి చాంద్బాష పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే కాలువ శ్రీనివాసులు వైపే పార్టీ అధిష్టానం మొగ్గుచూపింది. ఇలా అదృష్టజాతకుడిగా నిలిచారని టిడిపి నేతలు చెబుతుంటారు.
. సుజానా చౌదరి కారణంగా కర్నూల్ బాధ్యతలు
కర్నూల్ జిల్లా టిడిపి బాధ్యతలను కేంద్రమంత్రి సుజనా చౌదరి చూస్తున్నారు. అయితే కేంద్రంలో ఎక్కువ పనుల కారణంగా కర్నూల్ జిల్లా రాజకీయాలపై సుజనా దృష్టి పెట్టలేకపోతున్నారు.దరిమిలా నంద్యాల ఇన్ఛార్జ్గా ఉన్న కాలవకే కర్నూల్ జిల్లా బాధ్యతలు కూడా అప్పగించారు. నంద్యాల ఎన్నికలను ఆయన పర్యవేక్షణలోనే జరుపుతున్నారు.
అనంతలో జాతీయపతాకావిష్కరణ
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ సమయంలో కూడ కాలువ శ్రీనివాసులును అదృష్టం మరో రూపంలో కలిసివచ్చింది. అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ జెండా వందనం చేయాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రితో కలిసి మరో కార్యక్రమంలో ఆయన పాల్గొనడంతో అనంతపురంలో జెండా వందనం చేసే భాగ్యం కాలవకు దక్కింది. ఈ మార్పును జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. దీంతో అనంతలో పుట్టి, జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణిస్తున్న కాలవ శ్రీనివాసులు ఆగస్టు 15న అక్కడ జెండా వందనం చేశారు. అదృష్టం ఉన్నందునే ఎక్కడ ఉన్నా ఆయనకు అవకాశాలు కలిసివస్తున్నాయంటున్నారు కొందరు టిడిపి నేతలు