'ఏపీకి వెంకటేశ్వర స్వామి అదృష్టం, జగన్ దురదృష్టం', 'విజయమ్మను తిట్టిన బొత్స'
విజయవాడ: ఏపీలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉండటం అదృష్టం అయితే, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ లాంటి వారు ఉండటం దురదృష్టమని మంత్రి కామినేని శ్రీనివాస రావు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక హోదా పైన బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు. కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించామనడం సరికాదన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విజ్ఞప్తి మేరకే చంద్రబాబును కలిశామన్నారు.
ముద్రగడపై టిడిపి నేత ఆగ్రహం
కాపుల అభివృద్ధిని ముద్రగడ పద్మనాభం అడ్డుకోవద్దని తెలుగుదేశం పార్టీ నేత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వేరుగా కోరారు. చంద్రబాబును విమర్శించే అర్హత బొత్స సత్యనారాయణకు లేదన్నారు. రాష్ట్ర విభజనకు ప్రోత్సహించింది బొత్సానే అన్నారు. అసెంబ్లీలో విజయమ్మను బొత్స దుర్భాషలాడారని గుర్తు చేశారు.
ముద్రగడ దీక్ష ఎందుకు చేస్తున్నారో ఎవరికీ తెలియదని మరో టిడిపి నేత బోండా ఉమ మహేశ్వర రావు అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేరుస్తున్నారన్నారు. అనుమానాలు ఉంటే చంద్రబాబును కలిసి సలహాలు ఇవ్వవచ్చునని సూచించారు.
ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టవద్దని హితవు పలికారు. ముద్రగడ వ్యక్తిగత ప్రతిష్ట కోసం కులాన్ని వాడుకోవద్దని చెప్పారు. ముద్రగడ దుందుడుకు చర్యలతో కాపులకు నష్టం కలగవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంఘవిద్రోహ శక్తులపై ఉక్కుపాదం తప్పదన్నారు.