ముందస్తు ఎన్నికలపై మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ముందస్తు ఎన్నికల పైన ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సమయంలో ముందస్తు పైన చర్చ జరిగిందంటూ జాతీయా మీడియా ప్రచారం చేసింది. గత కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం జగన్ ముందస్తుకు అకవాశం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు తొమ్మిది నెలల సమయం ఉందని..షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మరోసారి ఈ చర్చ తెర మీదకు వచ్చింది.
ఇప్పుడు ఏపీ మంత్రి ఈ ప్రచారం పైన స్పందించారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేసి విజయం సాధించామని.. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల పైనే చర్చ జరిగిందని వెల్లడించారు.

నాటి చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను దివాలా తీయించిందని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం 20 వేల కోట్ల అప్పులు చేసి, వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారని ఆరోపించారు. ఆ అప్పులన్నీ తాము తీర్చామని చెప్పుకొచ్చారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చామన్నారు. కోటి 46 లక్షల మందికి రేషన్ ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చామని, వాటికి కేంద్రం సాయం చేయాలని కోరామన్నారు. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసిందని మంత్రి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సమయంలో మొదలైన ముందస్తు ఎన్నికల పైన ఎంపీ మిధున్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఆలోచన లేదని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెప్పారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ముందస్తు ఖాయమని చెప్పుకొచ్చారు. అటు ప్రతిపక్షాలు సైతం ఏపీలో ముందస్తు ఖాయమనే అంచనాలతో ఉన్నాయి. కేంద్రం అయిదు రాష్ట్రాలతో పాటుగా లోక్ సభకు ముందస్తుకు వెళ్లాలని నిర్ణయిస్తే..ఏపీ ప్రభుత్వం దాని పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో... ఇప్పుడు ఏపీలో ఎన్నికలు షెడ్యూల్ మేరకే జరుగుతాయా..ముందస్తు ఉంటాయా అనే చర్చ ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications