పవన్ కల్యాణ్ పై పోటీకి సిద్దమవుతున్న మంత్రి..!!
ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. టీడీపీ- జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. ఈ రెండు పార్టీలు లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది. టీడీపీ ఎలాగైనా అధికారంలోకి రావటానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అటు వైసీపీ..ఇటు టీడీపీలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులు ఇప్పటికే ఖరారయ్యారు. టీడీపీ సిట్టింగ్ లు అందరికీ సీట్లు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో..సిట్టింగ్ స్థానాల్లో జనసేన కు దక్కే అవకాశం లేదు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని పైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ వైసీపీ లక్ష్యంగా దూకుడు పెంచారు. దీనికి కౌంటర్ గా పవన్ ను టార్గెట్ చేసేందుకు మంత్రులు ముందుకు వస్తున్నారు. పవన్ పైన పోటీ చేసేందుకు తాను సిద్దమని ఏపీ మంత్రి కారుమూరి ప్రకటించారు.
2019 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఆరు స్థానాలు గెలుచుకోగా.. జనసేన ఒక్క స్థానంలో గెలుపొందింది. మిగిలిన అన్ని సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. ఈ సారి టీడీపీ - జనసేన పొత్తు లాంఛనంగా కనిపిస్తున్న వేళ.. సమీకరణాలు ఎలా ఉంటాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ పొత్తు ప్రభావం గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రెండు జిల్లాల్లో ఉన్న 34 సీట్లలో ఎవరు ఎక్కువ సీట్లు దక్కించుకుంటే వారికే అధికారం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పవన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంతో పాటుగా విశాఖలోని గాజువాక నుంచి పోటీ చేసారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఓడి పోయారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరితో పాటుగా రాయలసీమ నుంచి పవన్ పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి కారుమూరి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
చంద్రబాబు - లోకేష్ పాదయాత్రలు చేసినా ఒరిగేది లేమీ లేదని మంత్రి కారుమూరి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి పోటీ చేసినా..వైసీపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. తాను పవన్ పైన పోటీకి సిద్దంగా ఉన్నానని మంత్రి ప్రకటించారు. పవన్ తణుకు నుంచి తన మీద పోటీ చేయాలని కారమూరి సవాల్ చేసారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అని మంత్రి కారుమూరి చెప్పుకొచ్చారు. తణుకు నుంచి కారుమూరి 2009, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 20019 ఎన్నికల్లో కారుమూరికి తణుకు లో 75,975 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ధి రాధాక్రిష్ణకు 73,780 ఓట్లు వచ్చాయి. జనసేన నుంచి పోటీ చేసిన పసుపులేటి వెంకట రామారావుకు 31,961 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తే సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు మంత్రి కారుమూరి ప్రకటన పైన జనసేన ఏ రకంగా స్పందిస్తుందనేది చూడాలి.