ఎజెండా సెట్ చేసేది చంద్రబాబు.. అమలు చేసిది సోము వీర్రాజు : కొడాలి నాని చురకలు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అధికార , విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్నాయి . ఢీ అంటే ఢీ అంటూ సవాల్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా మంత్రి కొడాలి నాని టీడీపీ, బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీని టీడీపీ అధినేత చంద్రబాబుకు అద్దెకిచ్చారని విమర్శలు గుప్పించారు. ఎజెండా చంద్రబాబు సెట్ చేస్తే.. సోము వీర్రాజు అమలు చేస్తున్నారని చురకలు అంటించారు.

టీడీపీకి బీ-పార్టీగా బీజేపీ
ఏపీలో తెలుగుదేశానికి బీ-పార్టీగా బీజేపీ మారిందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు టీడీపీకి బీ-టీంగా కాషాయపార్టీని తయారు చేశారని విమర్శించారు. సోము వీర్రాజు సీఎం జగన్పై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని బీజేపీకి తమ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.

జిల్లాల పునర్విభజన ప్రక్రియ అద్భుతం
జిల్లాల పునర్విభజన ప్రక్రియ పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అద్భుతంగా ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆ మేరకు 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని చోట్ల పలు ప్రాంతాలను కలిపారని .. చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పారు.

సుపరిపాలన అందిచడమే లక్ష్యం
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అమలు చేస్తోన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని కొడాలి నాని పేర్కొన్నారు. 11 వేల ఆర్బీకే కేంద్రాలు, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రజలకు సుపపాలన అందిచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో సీఎంగా జగన్ ప్రజల మనసు గెలుచుకున్నారని అన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు.

సీఎం జగన్కు పాదాభివందనం
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎం జగన్కు పాదాభివందనం చేస్తున్నానని కొడాలినాని పేర్కొన్నారు. గతంలో పాదయాత్ర సమయంలో జగన్ను కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరామని గుర్తు చేశారు. అప్పుడే.. జిల్లాల విభజన అనంతరం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టారని వివరించారు.












Click it and Unblock the Notifications