ఏపీని నాశనం చేసేందుకు సీబీఎన్ 420 వైరస్...బాబు జూమ్ మీటింగ్లపై నిఘా సంస్థలు కన్నేయాలి : కొడాలి నాని
కర్నూలులో ఎన్440కే అనే ప్రమాదకర కరోనా మ్యుటెంట్ వ్యాప్తి చెందుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు కూడా నమోదైంది. తప్పుడు ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సీబీఎన్ 420 వైరస్...
టీడీపీ శ్రేణులతో జరుపుతున్న జూమ్ సమావేశాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎవరెలా చనిపోయినా కరోనాతోనే చనిపోతున్నారని.. కర్నూలులో ఎన్440కే వైరస్ వ్యాప్తి చెందుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేందుకు సీబీఎన్ 420 అనే వైరస్ నారావారిపల్లెలో పుట్టిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్నారు.
ప్రభుత్వం పూర్తి బాధ్యతతో ఉంది : కొడాలి నాని
కేంద్ర ప్రభుత్వం పరిమితి మేరకే కరోనా టీకాలు ఇచ్చిందని కొడాలి నాని పేర్కొన్నారు.టీకాల కోసం రూ.1600 కోట్లు కేంద్రానికి చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని... ప్రతిపక్ష పార్టీలు టీకాలు తెప్పిస్తే రోజుకు 10లక్షల డోసులు వేయించేందుకు సిద్దమని తెలిపారు. ప్రజారోగ్యం పట్ల వైసీపీ ప్రభుత్వం పూర్తి అవగాహన,బాధ్యతతో ఉందన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. కాబట్టి చంద్రబాబు,ఇతర విపక్ష నేతలు అనవసర రాజకీయ విమర్శలు చేయవద్దన్నారు.
అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు : నాని
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఎవరు వ్యవహరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొడాలి నాని హెచ్చరించారు.రాష్ట్రంలోని నిఘా సంస్థలు టీడీపీ జూమ్ మీటింగ్స్పై ఒక కన్నేసి ఉంచాలన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభణకు ఎల్లో మీడియానే కారణమని... ఎన్నికలు పెట్టి కరోనా ఉధృతికి కారణమయ్యారని ఆరోపించారు.
కరోనా చికిత్సకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని... పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కరోనా వ్యాప్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కేసులు పెట్టి జైలుకి పంపించాలన్నారు. రాష్ట్రానికి అవసరమైన టీకాల కోసం ఇప్పటికే మాన్యుఫాక్చర్ కంపెనీలకు,కేంద్రానికి లేఖలు రాశామని చెప్పారు.