కారు వదిలేసి, సైకిల్ పైన బందరు చుట్టేసిన ఏపీ మంత్రి
విజయవాడ: ఎప్పుడు బుగ్గ కారులో ప్రయాణించే మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం నాడు సైకిల్ ఎక్కారు. ఉదయం మచిలీపట్నం పురపాలక సంఘ పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి సైకిల్ పైన వార్డుల పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా సమస్యలు స్వాగతం పలికాయి.
పట్టణంలోని సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు ఆయన సైకిల్ పైన ప్రయాణించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల తీరు పట్ల ఆయన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
కోనేరు సెంటరులో బయలుదేరిన మంత్రి రవీంద్ర బృందం బస్టాండ్ సెంటర్, జెడ్పీ సెంటర్, పెయింటర్స్ కాలనీ, నీలగిరి కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణకు అధిక నిధులు కేటాయిస్తున్నా పనులు మాత్రం అంతంతమాత్రంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెయినేజీలో మురుగునీరు పారుదల లేక ఇబ్బందులు పడుతున్నామని, వర్షాకాలంలో ఇళ్ళల్లోకి నీరు వచ్చి చేరుతుందని పలుచోట్ల కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆయన మందలించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రెయినేజీ అనుసంధానికి మొదటి విడతగా రూ.18కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో డ్రైనేజీలను అనుసంధానం చేసి సక్రమంగా మురుగునీటి పారుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.