ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్- టెట్ ముహూర్తం ఫిక్స్..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని 2024 ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత డీఎస్సీ నిర్వహించిన ప్రభుత్వం దాదాపు 16 వేల మందికి కొత్తగా టీచర్లుగా నియమించారు. ఇప్పుడు మరో డీఎస్సీ నిర్వహణ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ తో పాటుగా టెట్ నిర్వహణ పైన మంత్రి లోకేష్ ప్రకటన చేసారు.
ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల కోసం వేచి చూస్తున్న అభ్యర్ధులకు ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. మరో డీఎస్సీ నిర్వహణకు సిద్దమైంది. ఈ మేరకు మంత్రి లోకేష్ ప్రకటన చేసారు. 2026 జనవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, మార్చిలో పరీక్షలు నిర్వహణ జరగనున్నట్లు లోకేశ్ ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ పోస్టులో చేసిన ప్రకటనలో.."పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించాను. ప్రతి ఏడాది డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీని ప్రభుత్వం కట్టుబడి కొనసాగిస్తుంది. ఈ ఏడాది నవంబర్ మూడో వారంలో టెట్, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

దీనికి కొనసాగింపుగా.."టెట్, డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళికను అమలు చేస్తాం. అదనంగా స్పెషల్ డీఎస్సీ కూడా నిర్వహిస్తాం.." అని తెలిపారు. ప్రభుత్వం ప్రతీ ఏడాది డీఎస్సీ పరీక్షల ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయడంపై కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఇకపై ఉపాధ్యాయ నియామకాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని..దీంతోద్వారా ప్రతి సంవత్సరం వేలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. డీఎస్సీతో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కూడా నవంబర్ మూడో వారంలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసారు. టెట్ అర్హత పొందిన అభ్యర్థులు డీఎస్సీకి హాజరుకావడానికి అర్హత సాధిస్తారని తెలిపారు.
ఇందుకు సంబంధించి "టెట్, డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అభ్యర్థులు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలి. ఈసారి పరీక్షా విధానం పూర్తిగా పారదర్శకంగా, సాంకేతిక పద్ధతిలో నిర్వహిస్తాం" అని లోకేశ్ తన ట్వీట్లో వెల్లడించారు. అదే విధంగా విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోందని లోకేశ్ తెలిపారు. ఈ క్రమంలో బేస్లైన్ టెస్టులు నిర్వహించి, ప్రతి విద్యార్థి స్థాయిని అంచనా వేయాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 78 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సింగపూర్ పర్యటనకు పంపించి, అక్కడి విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలను అధ్యయనం చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications