ఏపీపై బీజేపీ ఫోకస్: మోడీ సీరియస్, సోము వీర్రాజు వ్యాఖ్యలపై మాణిక్యాలరావు
అమరావతి: ఏపీపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేకహోదా శ్రద్ధ పెట్టినట్టే కనిపిస్తోంది. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడికి దిగాయి. ఇటీవల ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో ఏపీ బీజేపీ నేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రత్యేకహోదాపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని మంత్రి మాణిక్యాలరావు ఆరోపించారు. ప్రత్యేకహోదాపై కూడా స్పందించిన ఆయన హోదాను వరకట్నంతో పోల్చారు. చట్ట ప్రకారం వరకట్నం ఇవ్వడం సాధ్య పడదన్నారు.
పసుపు, కుంకుమ రూపంలో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో సోము వీర్రాజు మాట్లాడుతూ హోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడే హోదా సంజీవని ఏమీ కాదని అన్నారని గుర్తు చేశారు.

చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపై తాను విమర్శలు చేయడం లేదని చెప్పారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం తన ఉద్దేశం కాదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో రూ. 700 కోట్ల నిధులు మాత్రమే వస్తాయని, అవే ఏపీకి సరిపోతాయా? అంటూ ప్రశ్నించారు.
దీంతో సోము వీర్రాజు వ్యాఖ్యలపై అటు సోషల్ మీడియాలో సైతం ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంలో ఏదో ఒకటి తేల్చాలలని, ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలు సమావేశమై నిర్ణయించారు.
ప్రత్యేకహోదా విషయమై క్లారిటీ ఇవ్వకుంటే ఏపీలో పార్టీకి ఇబ్బందేనని పలువురు నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ విషయాలన్నీ ప్రధాని మోడీ చెవిన పడటంతో దీన్ని సీరియ్సగా తీసుకున్న ప్రధాని ఆంధ్రప్రదేశపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు మొదలుకొని మండల కేంద్రాల వరకూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం సాయం చేసిందో వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'వికాస్ పర్వ్' పేరుతో దేశవ్యాప్తంగా పార్టీశ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.
దీంట్లో భాగంగా ప్రతి రాష్ట్రానికీ కేంద్ర మంత్రులను రప్పించుకొని ఆ రాష్ట్రానికి కేంద్రం రెండేళ్లలో ఏం చేసిందో వివరించాలని రాష్ట్ర శాఖలకు జాతీయ నాయకత్వం నుంచి ఆదేశాలు అందాయి.












Click it and Unblock the Notifications