వీర జవాన్ శవపేటిక మోసిన నారా లోకేష్.. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
భారత్ - పాక్ యుద్దంలో తెలుగుబిడ్డ వీరమరణం పొందారు మురళీ నాయక్. ఆయన స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లి తాండాలో.. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలను నిర్వహించారు. మురళీనాయక్ పార్థివ దేహానికి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం.. మంత్రి లోకేష్ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతే కాకుండా అంతిమ వీడ్కోలు యాత్రలో సైతం అమర జవాన్ శవపేటికను స్వయంగా తన భుజాలపై మోశారు. మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా నిలుస్తాయని హామీ ఇచ్చారు.
పాకిస్థాన్తో జరిగిన ఎదురుకాల్పుల్లో మురళీనాయక్.. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించడం అత్యంత బాధాకరమని అన్నారు. సరిహద్దుల్లో మన సైనికులు అహర్నిశలు పోరాడుతున్నందునే దేశ ప్రజలంతా సురక్షితంగా ఉండగలుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. చనిపోతే భారత జెండా కప్పుకుని చనిపోతా ఆయన వ్యాఖ్యానించేవారని మంత్రి గుర్తుచేసుకున్నారు.

ఇక మురళీనాయక్ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్లతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు వారి కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు నిర్మించుకోవడానికి 300 గజాల ఇంటి స్థలం కేటాయించనున్నట్లు వెల్లడించారు. మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు.
మరోవైపు మురళీనాయక్ అంత్యక్రియలు వారి సొంత భూమిలోనే నిర్వహిస్తున్నందున, అక్కడే ఆయన జ్ఞాపకార్థం ఒక మెమోరియల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు అలానే జిల్లా కేంద్రంలో మురళీనాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కళ్లితండా గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు, గ్రామానికి 'మురళీనాయక్ తండా'గా పేరు మార్చనున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ సైనికుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీ నాయక్ గారి భౌతికకాయానికి అశ్రునివాళులు అర్పించాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశాను. అగ్నివీర్ మురళీ నాయక్ ఋణం తీరనిది.
— Lokesh Nara (@naralokesh) May 11, 2025
జైహింద్.#VeerJawaan… pic.twitter.com/NQC8uzPxp3
అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తీవ్ర భావోద్వేగంతో ఉన్న మురళీ నాయక్ కుటుంబాన్ని పవన్ ఓదార్చారు. వాళ్లకు ధైర్యం చెబుతూ పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కలిచివేసింది. వీరితో పాటు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, కందికుంట ప్రసాద్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తదితరులు జవాను భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications