బెంగళూరు కంపెనీకి నారా లోకేష్ ఆహ్వానం
బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులు, అధ్వానంగా మారిన రోడ్ల కారణంగా జెయింట్ లాజిస్టిక్ కంపెనీ బ్లాక్ బక్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక్కడి నుంచి వెళ్లిపోనుంది. తొమ్మిది సంవత్సరాలుగా బెల్లందూరు అవుటర్ రింగ్ రోడ్డులో గల ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయనుంది. రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోండటం, రోడ్లు అత్యంత దయనీయంగా మారడం, ఆఫీస్ కు వెళ్లడానికి ఉద్యోగులకు గంటన్నరకు పైగా సమయం పడుతోండటం వల్ల ఈ నిర్ణయానికొచ్చింది.
ఈ విషయాన్ని బ్లాక్బక్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ యాబాజీ వెల్లడించారు. తమ కంపెనీని ఇక్కడి నుండి మార్చనున్నట్లు తెలిపారు. ఇక్కడి మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్ పరిస్థితు మెరుగుపడే అవకాశం లేదని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

బ్లాక్బక్.. లాజిస్టిక్ టెక్నాలజీ ప్లాట్ఫాం. బెంగళూరు ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోందీ సంస్థ. బెల్లందూరు అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చాలాకాలం నుంచి కొనసాగుతోంది. బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఇదీ ఒకటి. వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక్కసారి ట్రాఫిక్ లో చిక్కుకుంటే అప్పుడప్పుడే బయటపడటం కష్టం అని భావించే మార్గం ఇది.
ఈ కంపెనీని ఏపీకి ఆహ్వానించారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నానికి ఉన్న ప్రత్యేకతలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. బ్లాక్బక్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ యాబాజీ చేసిన ట్వీట్ కు కొద్దిసేపటి కిందటే నారా లోకేష్ రిప్లై ఇచ్చారు. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను పరిశీలించాలని, దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి తనను నేరుగా సంప్రదించాలని సూచించారు.
దేశంలోనే అత్యుత్తమ క్లీనెస్ట్ నగరాల్లో విశాఖపట్నం ఒకటిగా నిలిచిందని నారా లోకేష్ గుర్తు చేశారు. పరిశుభ్ర నగరాల్లో వైజాగ్.. అయిదో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా వైజాగ్ గుర్తింపు పొందిందని తెలిపారు.












Click it and Unblock the Notifications