నన్ను నిర్బంధించారు: చిరంజీవి, మీరేం చేశారు.. దాసరి-చిరులపై నారాయణ భగ్గు
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో కాంగ్రెస్ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డిలు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. తమ మద్దతు ముద్రగడకు ఉంటుందని చెప్పారు.
కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించిన ముద్రగడ వెనుక తాము నిలబడతామన్నారు. కాపులకు రిజర్వేషన్ పైన ముద్రగడ చేస్తున్న ఉద్యమం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్ కార్యాచరణను ముద్రగడ తనకు వివరించారని, ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
తాను గతంలో ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తే తనను విమానాశ్రయంలో నిర్బంధించారని ఆరోపించారు. దాసరి కూడా ముద్రగడను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని దాసరి డిమాండ్ చేశారు.
ఈ విషయంలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ముద్రగడ ఉద్యమానికి మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు కూడా మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
మంత్రి నారాయణ.. చిరంజీవి, దాసరిల పైన భగ్గుమన్నారు. గతంలో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన వీరిద్దరు కాపు వర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. కాపుల సంక్షేమాన్ని పట్టించుకోని ఇటువంటి నేతలను దగ్గరకు చేర్చుకోవద్దని కాపులకు నారాయణ పిలుపునిచ్చారు.
దాసరి నారాయణరావుని వైసిపి అధినేత జగన్ కొద్ది రోజుల క్రితం కలిశారని, ఇప్పుడు ముద్రగడ కూడా కలిశారని నారాయణ అన్నారు. జగన్ చెప్పినట్లే ముద్రగడ పని చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో కాపులు చిరంజీవిని నమ్ముకుంటే వారిని నట్టేట ముంచి సదరు నేత కాంగ్రెస్లో కలిసిపోయారన్నారు.
కాపులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాపులకిచ్చిన హామీలన్నిటినీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ముద్రగడ ప్రభుత్వం వేసిన కమిషన్ను ఒక్కసారైనా కలిశారా అని ప్రశ్నించారు. కాపుల సమస్యలు పరిష్కరించేందుకు తాము కమిషన్ ఏర్పాటు చేసినా, గడువు ముగియకముందే మళ్లీ హెచ్చరికలు విడ్డూరమన్నారు.