ఈనాడుపై వైయస్ కక్ష గుర్తుందా: సోమిరెడ్డి, తుని ఘటనలో జగన్ పాత్ర: నారాయణ
విజయవాడ: తుని ఘటనలో ప్రభుత్వం పలువురిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్షకు దిగడంపై టిడిపి నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు స్పందించారు. అలాగే, సాక్షి టీవీ పైన ఆంక్షళ పైన కూడా మాట్లాడారు.
ముద్రగడ దీక్ష నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి.. ముద్రగడకు అనుకూలంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
గతంలో కాపుల రిజర్వేషన్ల అంశం పైన ఇరువురు నేతలు ఎలా స్పందించారో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. జగన్, బొత్స, రఘువీరా రెడ్డి లాంటి వారంతా కుట్రను చేస్తూ కాపులను టిడిపికి దూరం చేయాలని చూస్తున్నారన్నారు.
తుని విధ్వంసం ఘటనలో పాల్గొన్న వ్యక్తుల పైన కేసులు పెట్టవద్దని జగన్ మాట్లాడటం సరికాదన్నారు. రైళ్లు తగలబెడితే, పోలీస్ స్టేషన్ల పైన దాడి చేస్తే కేసులు పెట్టడం తప్పా అని ప్రశ్నించారు. తునిలో కాపులు చేసింది ఉద్యమం కాదని, విధ్వంసం అన్నారు.
మీడియా గొంతు నొక్కుతున్నామని వైయస్ జగన్, వైసిపి నేతలు విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల పైన వైయస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన తీరును అప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు.
తుని ఘటనలో జగన్ ప్రమేయం ఉందనేందుకు ముద్రగడ దీక్ష పైన ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని మంత్రి నారాయణ అన్నారు. సీబీఐ కేసుల్లో ఉన్న జగన్ ప్రతి దానికి సీబీఐ విచారణ అనడం విడ్డూరమన్నారు.
ముద్రగడ పురుగుల మందు తాగుతానంటే చూస్తూ ఊరుకోవాలా అన్నారు. కాపులకు ఏం ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు చేస్తున్నారన్నారు. తుని ఘటన బాధ్యులకు శిక్ష వేయాలని ముద్రగడే కోరాలని, అప్పుడే కాపుల పైన పడ్డ చెడ్డపేరు తొలగిపోతుందన్నారు.