మంత్రి నారాయణపై కెఈతో సహా మంత్రుల గుర్రు: బాబుపై కినుక
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణపై కొంత మంది మంత్రివర్గ సహచరులు తీవ్రంగా మండిపడుతున్నట్లు సమాచారం. నారాయణ తీరుపై బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. పేరు ప్రస్తావించకుండా వారు నారాయణపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి మంత్రివర్గ సమావేశానికి రాలేదు. మిగతా ఇద్దరు ముగ్గురు మంత్రులు తమ అభిప్రాయాలను వినిపించినట్లు చెబుతున్నారు.
ఇతర మంత్రిత్వ శాఖల్లో నారాయణ వేలు పెట్టడమే దానికి కారణమని అంటున్నారు. ఎపి రాజధాని అమరావతి నిర్మాణం పనులన్నీ నారాయణే చూస్తున్నారు. జపాన్, సింగపూర్ ప్రభుత్వాలతో ఆయనే సంప్రదింపులు జరుపుతున్నారు. భూసేకరణ వ్యవహారమంతా ఆయనే చూశారు. రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న తనకు అందులో పాత్ర లేకపోవడంపై డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి గుర్రుమంటున్నట్లు తెలుస్తోంది.
రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పత్తిపాటి పుల్లారావు నారాయణ తీరుపై మండిపడినట్లు, మంత్రివర్గ సమావేశంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. వారిని సముదాయించడానికి చంద్రబాబు ప్రయత్నించారని అంటున్నారు.
సిఆర్డిఎ పరిధిలోని నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా నారాయణపై మండిపడుతున్నట్లు చెబుతున్నారు. గోదావరి పుష్కారల ఏర్పాట్ల కోసం ఏర్పాటైన కమిటీకి కూడా నారాయణనే నేతృత్వం వహించారు. గోదావరి పుష్కరాల మొదటి రోజు తొక్కిసలాట జరిగి 27 మంది మరణించిన సంఘటనకు కూడా నారాయణనే నిందిస్తున్నారు.
గోదావరి పుష్కరాల రోజు ఏర్పాట్లను పర్యవేక్షించకుండా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వెంటే ఉన్నారని వారు నిందిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద, నారాయణకు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండడాన్ని కూడా చాలా మంది మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.