జగన్ ఢిల్లీకి ఎందుకెళ్తున్నారు?: నారాయణ డౌట్
గుంటూరు/ చిత్తూరు : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నారో సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ డిమాండ్ చేశారు. రాజధాని, పట్టిసీమను అడ్డుకోవడానికా, లేకుంటే కేసులు మాఫీ కోసమా? అనే ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పాలని మంత్రి నిలదీశారు.
శుక్రవారం భూమి చదును పనుల్లో భాగంగా రాయపూడిలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి ట్రాక్టర్లు నడిపారు. రేపు(శనివారం) మంగళగిరి మండలం నిడమర్రు, నీరుకొండ, కురగళ్లులో 50 ట్రాక్టర్లతో పనులు చేపట్టారు.
రాయలసీమకు నీరందించే పట్టిసీమ ప్రాజెక్టుపై జగన్ తీరు దుర్మార్గంగా ఉందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోపించారు. హంద్రీనీవాతోనే చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీటిని అందిస్తామని ఆయన చిత్తూరు జిల్లాలో అన్నారు.
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. రెండో విడతలో 4 వేల టన్నుల ఎర్రచందనాన్ని వేలం వేయనున్నట్లు మంత్రి బొజ్జల వివరించారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడుతామని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై వెంకయ్య పట్టించుకోకపోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి వెంకయ్య కార్యక్రమాలను అడ్డుకుంటామన్న ఆయన కేసులను వెనకాడబోమని తేల్చి చెప్పారు. భూసేకరణ చట్టం పేరుతో భూములు లాక్కొని ఇతర దేశాల కంపెనీలకు కేటాయిస్తే సహించేది లేదన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను కాపాడేందుకు కూలీలను కాల్చిచంపారని ఆరోపించారు.
మల్లిమస్తాన్బాబు పేరుతో మ్యూజియం ఏర్పాటు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.