మంత్రి నారాయణకు చిర్రెత్తుకొచ్చింది: అంధగాడు సినీ పోస్టర్ చించేశారు
మంత్రి నారాయణకు చిర్రెత్తుకొచ్చి అంధగాడు సినిమా పోస్టర్ను చించేశారు. ఒంగోలు కమిషనర్పై తీవ్రంగా మండిపడ్డారు.
ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో రాజ్ తరుణ్ హీరోగా నటించిన అంధగాడు సినిమా పోస్టర్ను చించేశారు. ఒంగోలు నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఒంగోలు నగర పాలక సంస్థ పనితీరుపై పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలో ఆకస్మిక తనిఖీల సందర్భంగా నగర సుందరీకరణ పనుల నిర్వహణను పర్యవేక్షించిన తర్వాత కమిషనర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన శాఖ పరిధిలోని నగర పాలక సంస్థ పాలనపై ఆయన దృష్టి సారించారు. ఇదివరకు కూడా ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమిషనర్వా... కాంట్రాక్టర్వా...
ఒంగోలు నగర పాలక సంస్థ పాలనపై దృష్టి సారించిన మంత్రి నారాయణ ఇటీవల కార్పొరేషన్ పాఠశాలలపై సమీక్ష చేస్తూ "నువ్వు కమిషనర్వా.. కాంట్రాక్టర్ వా!" అంటూ కమిషనర్ వెంకటకృష్ణపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శుక్రవారం నగర సుందరీకరణకు సంబంధించి ఆయనపై మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ముందస్తు సమాచారం లేకుండా...
ముందస్తు సమాచారం లేకుండా నారాయణ ఒంగోలు నగరానికి వచ్చిన డీఎంఏ కన్నబాబుతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ గోడలపై పోస్టర్లు అంటించి ఉండడాన్ని ఆయన గమనించారు. వెంటనే నేరుగా కారు దిగి కొన్నింటిని తొలగించారు.

అంధగాడు పోస్టర్ కూడా...
రాజ్ తరుణ్-హెబ్బాపటేల్ కాంబినేషన్లో వచ్చిన ‘అంధగాడు' సినిమా పోస్టర్ను స్వయంగా చించి నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు కన్పించకూడదని ఆయన కమిషనర్ను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ను ఈనెల 5 నుంచి పోస్టర్ రహిత రాష్ట్రంగా ప్రకటించినట్లు ఆయన చెప్పారు. నిబంధనలు అతిక్రమించి అంటించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు. అధికారులు ఇకపై అలసత్వం వహిస్తే సహించబోమని హెచ్చరించారు.

ఇతర ప్రాంతాల్లో కూడా....
రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని, అలాంటి వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ డీఎంఏను ఆదేశించారు. వారంలో కనీసం రెండుసార్లయినా ఒంగోలును స్వయంగా పరిశీలిస్తానని మంత్రి అధికారులకు తెలిపారు. లోపాలుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications