జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు.. చెయ్యాల్సిందేంటి? చేస్తున్నదేంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు ఎమ్మెల్యేగా, ప్రజా నాయకుడిగా నిమ్మల రామానాయుడుకి పాలకొల్లు నియోజకవర్గంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సామాన్యులలో సామాన్యుడిలా కలిసిపోయే నిమ్మల రామానాయుడు మంత్రి అయిన తర్వాత చేస్తున్న పనులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
నియోజవర్గంలో నిమ్మల పనులు
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిమ్మల రామానాయుడు స్థానికంగా ప్రజలతో కలిసిపోయి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసేవారు. చిన్నా పెద్ద తేడా లేకుండా, అన్ని పనులలోను కార్యకర్త మాదిరిగా తన భాగస్వామ్యాన్ని ఉండేలా చూసుకునేవారు. సామాన్య ప్రజలతో కలిసి చిన్న చిన్న పనులలో కూడా ఆయన భాగస్వామ్యం తీసుకునేవారు. అయితే మంత్రి అయిన తర్వాత కూడా నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు చేస్తూ కనిపించడం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణమైంది.

పొలం పనులు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
మొన్నటికి మొన్న పెన్షన్ రాని ఒక దివ్యాంగుడిని బైక్ పైన ఎక్కించుకొని పెన్షన్ ఇప్పించడానికి వెళ్లిన మంత్రి నిమ్మల రామానాయుడు తాజాగా పొలాలలో రైతులతో కలిసి పనిచేసి రైతులను ఉత్సాహపరిచారు. నేను మంత్రిని అయినప్పటికీ సామాన్యుడిని అని చెప్పే విధంగా పొలాలలో కలుపు మొక్కలు తీస్తూ నిమ్మల రామానాయుడు కనిపించారు.
జలవనరుల శాఖా మంత్రిగా బృహత్తరమైన బాధ్యత
అయితే ఆయన చేస్తుంది మంచి పనే అయినప్పటికీ జల వనరుల శాఖ మంత్రిగా బృహత్తరమైన బాధ్యత ఆయనపైన ఉందని ఏపీ ప్రజలు ఆయన వ్యవహార శైలి పై చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పూర్తికాని ప్రాజెక్టులు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలలో కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించవలసిన పరిస్థితులపై దృష్టి పెట్టాలని అంటున్నారు.
శాఖపై ఫోకస్ చెయ్యాలని ప్రజల విజ్ఞప్తి
జలవనురుల శాఖ మంత్రి అయిన నిమ్మల రామానాయుడు తన శాఖ పైన ఫోకస్ చేస్తే బాగుంటుందని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి తాగునీరు సాగునీరు అందించడం పైన ఫోకస్ పెడితే మంచిదని చెబుతున్నారు రాష్ట్ర ప్రజలు. నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు చేయడానికి సాధారణ కార్యకర్తలు, ఆయా శాఖల వారీగా సిబ్బంది ఉంటారని అంటున్నారు.
జలవనరుల శాఖలో మీ మార్క్ చూపించండి
ఆ పని ఒక మంత్రి చేయవలసిన అవసరం లేదని మంత్రిగా విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల పైన ఫోకస్ పెట్టాలని నిమ్మల రామానాయుడు కి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజాసేవలో తనను తాను మరిచిపోయి పనిచేసే మంత్రి నిమ్మల రామానాయుడు జల వనరుల శాఖలోనూ తన మార్కు చూపించాలని ఏపీ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అత్యంత కీలకమైన శాఖ మంత్రిగా ఉన్న మంత్రివర్య.. అసలు సమస్యల పైన దృష్టి పెట్టండి అని అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications