వేడుకకు రైతుల్ని పిలుస్తాం: మంత్రి నారాయణ, అమరావతి టెండర్పై ట్విస్ట్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన, భూమిపూజ నిర్వహణ బాధ్యతను ముంబైకి చెందిన విజ్ క్రాఫ్ట్ సంస్థ రూ.9.5 కోట్లకు కైవసం చేసుకున్న అంశంపై మంత్రి పీ నారాయణ సోమవారం స్పందించారు.
రాజధాని భూమిపూజ, శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాలను ఇప్పటి వరకు ఏ సంస్థకు అప్పగించలేదని వివరణ ఇచ్చారు. విజ్ క్రాఫ్ట్ సంస్థ పేరు పరిశీలనలో మాత్రమే ఉందని చెప్పారు. కాగా, విజ్ క్రాఫ్ట్ రూ.9.5 కోట్లకు టెండర్ దక్కించుకుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మాస్టర్ ప్లాన్ పూర్తయ్యాక డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పారు. రాజధాని శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి రాజధాని ప్రాంత రైతులను ఆహ్వానిస్తామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని శంకుస్థాపన జరుగుతుందన్నారు.
తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన మహాకవి జాషువా: బాబు
గుర్రం జాషువా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేరుగా అన్నారు. గుర్రం జాషువా 120వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాషువా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. తనను ఎగతాళి చేసిన వారిని జాషువా ఎదురు ప్రశ్నలు అడిగి అబ్బురపరిచేవారన్నారు. జాషువా రచించిన గబ్బిలం పుస్తకం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. భాషను కాపాడుకుంటే మన భవిష్యత్తును కాపాడుకున్నట్లేనని చెప్పారు.
తెలుగు వారి గుండెల్లో జాషువా చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల కోసం సబ్ప్లాన్ తీసుకొచ్చామన్నారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.