'ఆ ప్రశ్న బాబునే అడగండి, రాత్రిపగలు దాని గురించే ఆలోచిస్తున్నారు'
రాజమండ్రి: ఆ ప్రశ్నలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అడగాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం అన్నారు. రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలను విలేకరులు అడిగారు.
దీనిపై ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పైవిధంగా స్పందించారు. చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలను తనను అడుగుతున్నారన్నారు. చంద్రబాబు అందుబాటులోకి వస్తారని, ఆయననే అడగాలన్నారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం పల్లె మంత్రివర్గ వివరాలు వెల్లడించారు.
రాజమండ్రి తొక్కిసలాట ఘటన పైన మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా దీని పైన విచారణ జరిపిస్తామని చెప్పారు. 27 మంది మరణించడాన్ని తాము చిన్న విషయంగా చూడటం లేదన్నారు. చంద్రబాబు రాత్రి పగలు దాని గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించే అవకాశముందన్నారు.
కేబినెట్ వివరాలు చెబుతూ... ఏపీ రాజధానిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని, దీనికోసం ప్రధాని మోడీ కొన్ని సూచనలు చేశారన్నారు. ప్రధాని సూచన మేరకు కజకిస్తాన్, తుర్కిమినిస్తాన్ దేశాలను సందర్శిస్తామని చెప్పారు.
మూడు వేల ఎకరాల పరిధిలో నిర్మించనున్న అమరావతి నిర్మాణానికి దసరా నాడు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఈనెల 25 పుష్కరాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, పుష్కరాల చివరి రోజున పుష్కరజ్యోతి పేరుతో ప్రతి ఇంట్లో దీపారాధన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పుష్కరాల ముగింపు ఉత్సవాల్లో బాబా రాందేవ్ పాల్గొంటారన్నారు. వేడుకల్లో భాగంగా వెయ్యిమంది కళాకారులతో కూచిపూడి నృత్యం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. 26న మహా పుష్కర వనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల మొక్కలు నాటాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని, పుష్కరాల నిర్వహణ తీపి గుర్తుగా వనాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పుష్కర విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఆ రోజు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.
పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురువారం పట్టిసీమలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని, పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారన్నారు.
రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమల స్థాపన ముఖ్యమైనందున పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డీఆర్డీవో ఏర్పాటుకు 2,297 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించిందని, 2018 లోగా డీఆర్డీవో ఏర్పాటవుతుందన్నారు. 5వేల మందికి ఉపాధి ఉంటుందన్నారు.
ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 80 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని, ఇదే సమయంలో ప్రభుత్వ, వక్ఫ్ భూముల క్రమబద్ధీకరణపై కేబినెట్ ఉపసంఘం ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.
పట్టాదారు పాసు పుస్తకాల జారీలో జాప్యాన్ని నివారించాలని తీర్మానించామన్నారు. విజయనగరం జిల్లాలో గోల్ఫ్ కోర్సు, ఎకో పార్క్ నిర్మాణానికి భూముల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. నవలూరు గ్రామంలో ఉన్న హరిహత్ కంపెనీకి చెందిన 22.72 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంటామన్నారు.
ఆ భూములకు బదులుగా రాజధాని వెలుపల హరిహత్ కంపెనీకి భూమి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరితేనే వారితో చర్చలు జరపుతామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.