చంద్రబాబు కుప్పం టూర్ ఎండ్ కార్డ్: వైసీపీలో చేరిన ఆ నాయుడు: మంత్రి పెద్దిరెడ్డి పని షురూ
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన మూడు రోజుల చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటన ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఆ పర్యటన అసాంతం ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకున్నాయి. కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభల్లో 11 మంది మరణించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1ను జారీ చేసిన పరిస్థితుల మధ్య ఆయన ఈ పర్యటన చేపట్టారు. తన సొంత నియోజకవర్గ ప్రజలను కలుసుకున్నారు.
2024లో బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరు? - అమిత్ షా క్లారిటీ
పెద్దిరెడ్డి-చంద్రబాబు
ఈ పర్యటనలో చంద్రబబు- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఈ ఇద్దరు నాయకులు సవాళ్లు-ప్రతి సవాళ్లు విసురుకున్నారు. పరస్పరం ఘాటుగా విమర్శలను సంధించుకున్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉందని చెప్పుకొంటోన్న చంద్రబాబు- చివరికి వార్డు సభ్యుడిలా దిగజారి మాట్లాడుతున్నారంటూ పెద్దిరెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని ఓడించామని గుర్తు చేశారు.
పని మొదలు పెట్టిన పెద్దిరెడ్డి..
ఈ పరిణామాల మధ్య మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆపరేషన్ కుప్పం పని మొదలు పెట్టారు. చంద్రబాబు కుప్పం పర్యటన ముగిసిన మరుసటి రోజే- ఆయన వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లాస్థాయి నాయకుల చేరికలకు గేట్లు ఎత్తేశారు. కుప్పం, చిత్తూరు, పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పుకొన్నారు.
పల్లెబాటలో..
చిత్తూరు నియోజకవర్గం పరిధిలోని సోమలలో మంత్రి పెద్దిరెడ్డి ఇవ్వాళ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా నాయకుడు చంద్రశేఖర్ నాయుడు, ఆయన అనుచరులు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు 20 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను చూసి వారంతా వైసీపీలో చేరినట్లు పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
టీడీపీకి ఎదురుదెబ్బ..
తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు టీడీపీకి ఎదురుదెబ్బగానే భావిస్తోన్నారు. చంద్రశేఖర్ నాయుడు చేరిక టీడీపీకి గట్టిదెబ్బగా అంచనా వేస్తోన్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో టీడీపీ అభ్యర్థి గెలవడానికి ప్రతిసారీ ఆయన వ్యూహాలు పన్నుతుంటారని, అలాంటి కీలక నాయకుడు పార్టీని వీడటం నష్టం కలిగిస్తుందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఊపందుకుంది. తన అనుచర బలగాన్ని కూడా తీసుకుని వైసీపీలో చేరటం జిల్లాలో చర్చనీయాంశమైంది.