ఉగాదికి కొత్త జిల్లాలు.. చంద్రబాబు గొప్పగా ఏం చేశారో చెప్పాలి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టిడిపి 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామని చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈసారి ఎన్నికల్లో మరింత విజయం వైసిపికి అందించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
చంద్రబాబు తెలంగాణాలో కూర్చుని ఏపీ పాలనపై బురద చల్లుతున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూర్చొని ఏపీ పాలన పై బురద జల్లుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. విమర్శించింది ఏపి ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవుపలికారు. 2019లో 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గౌరవించారని, ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విషయం అందించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. డబ్బులతో ఎన్నికలకు వెళ్లే సంస్కృతి తెలుగుదేశం పార్టీది అని విమర్శించారు. వైసీపీలో అటువంటి సంస్కృతి లేదని స్పష్టం చేశారు.
ఏపీలో 14ఏళ్ళ పాటు సైకో పాలన సాగింది: ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 సంవత్సరాల పాటు సైకో పాలన సాగిందని టిడిపి పాలనను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు బినామీలు చందాలు వేసుకుని మరీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం ప్రయత్నిస్తున్నారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఆదుకుంటున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు
రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్త జిల్లాలు ప్రారంభమవుతాయని పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉగాది రోజున లాంచనంగా కొత్త జిల్లాల ఏర్పాటును ప్రారంభిస్తారని వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించిన ఆయన గతంలో జిల్లాలు సుదీర్ఘ ప్రాంతాలుగా ఉండటం వల్ల పాలనలో ఇబ్బందులు తలెత్తేవని పేర్కొన్నారు. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అధికారులకు జిల్లాపై పట్టు ఉంటుందని, జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సులభంగా తిరగడానికి వీలుంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
Recommended Video
14 సంవత్సరాలలో చంద్రబాబు గొప్పగా ఏం చేశారో చెప్పగలరా? ప్రశ్నించిన పెద్దిరెడ్డి
జగన్ పాలనలో ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేలా వసతులు కల్పించారని, ప్రతి పేషెంట్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లేలా నాడు నేడు కార్యక్రమంతో ఆధునీకరిస్తున్నారని, కడుపులో ఉన్న బిడ్డ నుండి అవ్వ తాతల వరకు అందరికీ ఆర్థిక అండ లభిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని అమ్మ ఒడి, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు సైతం ఇక్కడ అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 14 సంవత్సరాలలో మీరు ఇంత గొప్పగా ఏం చేశారో చెప్పగలరా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.