కుప్పంలో పోటీకి సిద్ధమైన పెద్దాయన?
ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై పోటీ చేయడానికి తాను సిద్ధమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కూడా కష్టమేనన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి పుంగనూరులో తనపై పోటీ చేయడానికి చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కుప్పం, పుంగనూరు.. రెండు నియోజకవర్గాల్లో పోటీకి తాను సిద్ధమని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీచేసే పరిస్థితే ఉండదని, ఆయన పనైపోయిందని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాను ఆయన ఎప్పుడో వదిలేశారని, ఆయన కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. చంద్రబాబు ప్రజా కంఠక పాలన చేశారని, ఆయనకు మమ్మల్ని తిట్టడంతప్ప వేరే పనేమీ లేదన్నారు. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, కుప్పంలో వైసీపీ గెలవడం ఖాయమన్నారు.
చంద్రబాబునాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య పోరు హోరాహోరీగా నడుస్తోంది. ఇద్దరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.
పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి వీరు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈసారి కుప్పంలో వైసీపీ గెలవాలనే లక్ష్యంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అభ్యర్థిగా భరత్ ను ప్రకటించారు. ఈ తరుణంలో జగన్ ఆదేశిస్తే కుప్పంలో పోటీకి పెద్దిరెడ్డి సిద్ధమని ప్రకటించారు.