చిత్తూరులో రోజాకు చెక్ పెడుతున్నదెవరు ? స్ధానిక పోరులో ఆధిపత్య పోరే కారణం.. !!
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. స్ధానిక ఎన్నికల పోరులో తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో సీనియర్ కావడం, సీఎం జగన్ కు సన్నిహితుడు కావడం పెద్దిరెడ్డికి కలిసి వస్తుండగా, రోజా మహిళా సెంటిమెంట్ తో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో చిత్తూరు స్ధానిక పోరులో వైసీపీలో వర్గపోరు ముదురుతోంది.

చిత్తూరులో వైసీపీ రాజకీయం
ఏపీలో విపక్ష నేత చంద్రబాబును తన సొంత గడ్డ చిత్తూరులో రాజకీయంగా దారుణంగా దెబ్బతీయడంలో సక్సెస్ అయిన వైసీపీ నేతలు ఇప్పుడు అంతర్గతంగా ఒకరినొకరు దెబ్బ తీసుకునే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. జిల్లాల్లో ఇన్నాళ్లు వైసీపీ రాజకీయాలను శాసించిన మంత్రి పెద్దిరెడ్డి వర్గానికి నగరి ఎమ్మెల్యే రోజా రూపంలో గట్టిపోటీ ఎదురవుతోంది. ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు కావడం, జిల్లాలో పట్టుకోసం ప్రయత్నిస్తుండటంతో వైసీపీలో అంతర్గత వర్గ పోరు ముుదురుతోంది. స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ఇది పతాక స్దాయికి చేరడంతో ఇరువర్గాల నేతలు నలిగిపోతున్నారు.

స్ధానిక టికెట్ల కోసం యుద్దం...
చిత్తూరు జిల్లాలో జరుగుతున్న స్ధానిక పోరులో వైసీపీని ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయించాలని భావిస్తున్న అధిష్టానం పెద్దలు ఆచితూచి టికెట్లను కేటాయిస్తున్నారు. ఇందులో సహజంగానే పెద్దిరెడ్డి వర్గానికి సింహభాగం దక్కాయి. అయితే వీరితో పోటీ పడిన ఎమ్మెల్యే రోజా మహిళా సెంటిమెంట్ తో అగ్గి రాజేశారు. తన వర్గానికి టికెట్లు ఇవ్వకపోతే జిల్లాలో మహిళల ఓట్లు కోల్పోతామంటూ వైసీపీ అధిష్టానానికి చేసిన సూచన బాగానే పనిచేసినట్లు కనిపిస్తోంది. దీంతో పెద్దిరెడ్డి వర్గం అంత కాకపోయినా తన అనుచరులకు రోజా గణనీయంగానే టికెట్లు దక్కించుకున్నారు.

టికెట్లు రాగానే సరిపోతుందా ..
చిత్తూరు జిల్లా స్ధానిక పోరులో అత్యధికంగా టికెట్లు దక్కించుకున్న మంత్రి పెద్దిరెడ్డి వర్గం ఇప్పుడు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తమకు అడ్డొచ్చిన బీజేపీ నేతలను సైతం వదిలిపెట్టకుండా దాడులు చేయిస్తోంది. జిల్లాలో పెద్దిరెడ్డి వర్గం జోరు ఏ స్ధాయిలో ఉందంటే ప్రధాన విపక్షమైన టీడీపీ పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గంలో ఎన్నికలను బహిష్కరించేసింది. దీంతో అక్కడ పోటీ ఏకపక్షమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. అదే సమయంలో జిల్లాలో రోజా వర్గం దక్కించుకున్న టికెట్లపై మంత్రి పెద్దిరెడ్డి దృష్టి పడింది. దీంతో ఇప్పుడు వారిని దెబ్బతీసేందుకు ఏకంగా టీడీపీ అభ్యర్ధులకు పెద్దిరెడ్డి వర్గం స్నేహహస్తం అందిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

పెద్దిరెడ్డితో రోజా ఆధిపత్య పోరుకు కారణాలివే...
చిత్తూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన పెద్దిరెడ్డి, రోజా వర్గాలు రెండూ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. అప్పట్లో నగరిలో రోజా గెలిస్తే తనకు ఇబ్బందులు తప్పవని భావించిన పెద్దిరెడ్డి వర్గం ఆమెకు వ్యతిరేకంగా పనిచేసిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరి నిమిషంలో జగన్ జోక్యంతో రోజా బయటపడినట్లు జిల్లాలో రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. అయితే ఎమ్మెల్యేలు అయిన తర్వాత పెద్దిరెడ్డి, రోజాల్లో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే విషయంలో జగన్ కు పెద్దగా క్లారిటీ అవసరం లేకపోయింది. విపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీని జీరోగా మార్చేసిన పెద్దిరెడ్డికే మంత్రి పదవి దక్కింది. అదే సమయంలో రోజాకు కూడా మంత్రి పదవి ఇస్తే ఈ ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతుందని జగన్ భావించినట్లు చెబుతుంటారు.
Recommended Video


స్ధానిక పోరులో మరోసారి..
గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆధిపత్య పోరు ప్రదర్శించిన పెద్దిరెడ్డి, రోజా వర్గాలు ఇప్పుడు మరోసారి స్ధానిక ఎన్నికల్లోనూ అదే తీరు కొనసాగిస్తున్నాయి. అయితే ఇరువర్గాల్లో ఉన్న అభ్యర్ధులు ఎవరు ఓటమిపాలైనా అధినేత జగన్ విధించిన నిబంధన ప్రకారం వారికి పార్టీలో ప్రయారిటీ కూడా తగ్గిపోతుంది. మంత్రి అయితే పదవే పోతుంది. అందుకే ఇరువురూ పరస్పరం దెబ్బతీసుకోవడం ద్వారా ప్రత్యర్ధుల రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications