ఆర్జీవీకి పేర్ని నాని షాక్ .. చట్ట ప్రకారమే టికెట్ల ధరలు.. ఇబ్బందైతే సినిమాలు వాయిదా వేసుకోండి..
సినిమా టికెట్ల వివాదంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మతో భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సినిమాటోగ్రఫి చట్టం ప్రకారమే తమ ప్రభుత్వం టికెట్ల రేట్లు నిర్ణయించిందని స్పష్టం చేశారు. తాము ఎక్కడా చట్టానికి వ్యతిరేకంగా చేయలేదని పేర్కొన్నారు. 1955 నుంచి సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే సినిమా టికెట్ల రేట్లు ఉన్నాయన్నారు. రామ్ గోపాల్ వర్మ తాను చెప్పాల్సింది చెప్పారు. వారి సూచనలు, సలహాలు స్వీకరించాం. తాము కూడా వర్మాకు చెప్పాల్సినవన్ని చెప్పాము అని పేర్ని నాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కొత్తగా సృష్టించింది ఏమి లేదన్నారు. చట్టం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
చట్టం ప్రకారమే టికెట్ల ధరలు
ఆంధ్రప్రదేశ్లో వైపీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరిరినీ ఇబ్బంది పెట్టే చర్యలు చేయడంలేదన్నారు మంత్రి పేర్ని నాని. ప్రతి వ్యక్తి అభిప్రాయాలను సంతృప్తిపరచడం కష్టమన్నారు. వాళ్ల లాజిక్లు వాళ్లు చెబుతారు. మేము కూడా లాజిక్ లు చెబితే ఎదుటి వారికి ఇబ్బంది కరంగా ఉంటుందని పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ చట్టాన్ని దాటి తాము ఎక్కడా టికెట్ల ధరపై నిర్ణయం తీసుకోలేదన్నారు. చట్టం ప్రకారమే టికెట్ల రేట్లు పెంచడంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2013లో ఇచ్చిన జీవో నెంబర్ 100లో పేర్కొన్న రేట్ల కంటే పెంచామన్నారు.
ఆర్జీవీలా రండి.. సలహాలు ఇవ్వండి
సినిమా టికెట్ల ధరలకు అంశానికి సంబంధించిన కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ సూచనలు ప్రకారం తదుపరి నిర్ణయం ఉంటుందని పేర్నినాని వివరించారు. వీటిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రామ్ గోపాల్ వర్మ మాదిరిగానే వచ్చి నేరుగా తనను కలిచి చెప్పొచ్చని సూచించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తాము. ఒక వేళ తనను కలవడం ఇబ్బందిగా భావిస్తే నేరుగా కమిటీతో చర్చించవచ్చు. ఆ కమిటీకి తనకు ఎలాంటి సబంధం లేదని , హోం సెక్రటరీతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని నాని పేర్కొన్నారు.
ఇబ్బంది అయితే సినిమాలు వాయిదా వేసుకోండి..
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందిగా భావిస్తే వారి సినిమాలను వాయిదా వేసుకోవచ్చని సూచించారు. కరోనా కారణంగానే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలను వాయిదా వేసుకున్నారు. సినిమా టికెట్ల తగ్గింపు విషయంలో హీరో నాగార్జునకు ఇబ్బంది లేదు. మాకూ ఇబ్బంది లేదు. మరి మిగతావారికి ఎందుకు ఇబ్బందని ప్రశ్నించారు. మంగళవారం ఈ సినిమా టికెట్ల ధరలపై కమిటీ సమావేశమవుతుంది.. జీవో 35పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్నినాని తెలిపారు..