అదే నిజమైతే.. జనం ఎందుకు ఉతికారేశారు : చంద్రబాబుపై పేర్ని నాని సెటైర్స్
టీడీపీ అధినేత చంద్రబాబు ఇక జన్మలో మారబోడని.. ఆయన ప్రెస్మీట్ చూస్తే అర్థమవుతోందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఆలోచించని చంద్రబాబు.. జాతీయా మీడియా దృష్టిని ఆకర్షించేందుకు తెగ ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన ప్రెస్మీట్లో సౌతాఫ్రికా అధ్యక్షుడు అక్కడి మూడు రాజధానులపై లేవనెత్తిన అభ్యంతరాలకు సంబంధించిన వీడియోను
ప్రదర్శించడంపై నాని సెటైర్స్ వేశారు. రేవంత్ రెడ్డి రహస్యంగా డబ్బులు తీసుకెళ్లిన వీడియో, తన బ్రీఫ్డ్ మీ ఆడియో కూడా చంద్రబాబు అందరికీ చూపిస్తే బాగుండేదని మంత్రి చురకలంటించారు.

అదే నిజమైతే..
మాట్లాడితే అభివృద్దికి తానే ఛాంపియన్ అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు అని.. అదే నిజమైతే ఏపీ ప్రజలు ఆయన్ను ఎందుకు ఉతికారేశారని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాలతో 90శాతం ప్రజలకు లబ్ది చేకూరుతుంటే... చంద్రబాబుకు ఇక్కడి ప్రజల మనోభావాలతో అసలేమాత్రం పనిలేదన్నారు. ఈ ఏడాది దావోస్ వెళ్లి తన ఖాతాల్లో డబ్బులను సరిచూసుకునే అవకాశం లేకపోయినందుకు చంద్రబాబు బాధపడుతున్నారేమో తేలాలని ఎద్దేవా చేశారు.

అమరావతిలో చేసిందేంటి...
గత ఐదేళ్లలో అమరావతిలో చేసిందేంటని ప్రశ్నిస్తే.. టీడీపీ నుంచి సమాధానం ఉండదని పేర్ని నాని అన్నారు. మూడు ప్రాంతాలకు చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించినా బదులు ఉండదన్నారు. నిజంగా చంద్రబాబు చెప్పినట్టు.. అమరావతిని అభివృద్ది చేసి ఉంటే తాడికొండ,మంగళగిరి నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోతారని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న టీడీపీని అడిగినా సమాధానం ఉండదన్నారు. రాజధాని పేరుతో అన్ని వేల ఎకరాలు సేకరించి కనీసం డ్రైనేజీలైనా తవ్వారా అని నిలదీశారు.

శంకుస్థాపన చేసినచోట పిచ్చి మొక్కలు..
సందర్భం వచ్చిన ప్రతీసారి హైదారాబాద్ను 9 ఏళ్లలో తానే అభివృద్ది చేశానని చంద్రబాబు చెబుతుంటారని.. కానీ ఐదేళ్లలో ప్రధాని మోదీ శంకుస్థాపన రాయి వేసిన దగ్గర పిచ్చి మొక్కలే ఎందుకు మిగిలాయంటే నోరు పెగలదన్నారు. రోడ్లు లేవు,నీటి పైప్ లైన్స్ లేవు,కరెంట్ లైన్స్ లేవన్నారు. కనీసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకుండానే 2వేల ఎకరాలు అమ్మేశారని ఆరోపించారు. రాయలసీమకు చెందినవాడైనప్పటికీ చంద్రబాబు శ్రీబాగ్ ఒప్పందాన్ని వ్యతిరేకించారని అన్నారు.

చంద్రబాబు దిగజారుడుతనం..
మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొట్టారని చంద్రబాబు చేసిన ఆరోపణలను నాని ఖండించారు. ఇది చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. గతంలో ఇదే విజయవాడలో హత్యకు గురైన ఐఏఎస్ రాఘవేంద్రరావు, జర్నలిస్టు పింగళి దశరథరామ్, వంగవీటి రంగాల హత్యలకు వేసిన స్కెచ్లు చంద్రబాబుకు గుర్తుకు వచ్చి ఉంటాయని విమర్శించారు. ప్రజా వేదికను ఎందుకు కూల్చారని చంద్రబాబు ఇంకా అమాయకంగా అడుగుతున్నారని.. నదిలో కట్టకూడదన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications