అందుకే గవర్నర్, అయ్య జాగీర్కాదు!: కేసీఆర్కు రావెల, సెక్షన్ 8పై టీడీపీకి కిషన్ షాక్
హైదరాబాద్: సెక్షన్ 8 పైన చాలా అపోహలు ఉన్నాయని మంత్రి రావెల కిషోర్ అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తాయనే ముందుగానే గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని సెక్షన్ 5లో ఉందని చెప్పారు.
సెక్షన్ 8 అంటే కేసీఆర్ చాక్లెట్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు చేసిన చట్టం అమలుపరచాలని తాము కోరుతున్నామన్నారు. తాను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానని, రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుంటానని అంటే కుదరదన్నారు. ఇది నా జాగీరు లేదా నా అయ్య జాగీరు అంటే కుదరదన్నారు.
హైదరాబాద్ ఎవరి జాగీరు కాదన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్లు తెలుసుకోకుండా మాట్లాడవద్దని తెరాస నేతలకు సూచించారు. ముందు విభజన బిల్లు పైన అవగాహన పెంచుకోవాలన్నారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాల్సిందే అన్నారు.
ఏదైనా ఆటలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పారు. విభజన సందర్భంగాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందించారని చెప్పారు. ఎవరైనా ఆటలో తొండి చేస్తే సరిదిద్దేందుకు రిఫరీని పెట్టినట్లే, రెండు రాష్ట్రాలకు గవర్నర్ను పెట్టారని చెప్పారు.
రెండు రాష్ట్రాలు హైదరాబాదులో ఎలా ఉంటాయని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారని, కానీ ఢిల్లీలో గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలు రెండు పరిపాలిస్తున్న విషయం తెలియదా అన్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకుంటున్న బాధ్యతను ఇక్కడ గవర్నర్ తీసుకోవాలన్నారు.
దేశ సార్వభౌమత్వాన్ని, రక్షణ వ్యవస్థకు కీలకమైన పలు రంగాలు హైదరాబాదులోనే ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని పరిరక్షించాలంటే గవర్నర్ తన చేతిలోకి శాంతిభద్రతలను తీసుకోవాలన్నారు.
ఇరు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాదులో సమాన ప్రాతినిథ్యం, భాగస్వామ్యం, హక్కు కల్పించే విధంగా గవర్నర్ చర్య తీసుకోవాలన్నారు. పునర్విభజన చట్టంలోని మిగతా సెక్షన్లలాగే సెక్షన్ 8ను కూడా అమలు చేయాలని తాము కోరుతున్నామని మరో మంత్రి పత్తిపాటు పుల్లారావు చెప్పారు.
సెక్షన్ 8పై నిర్ణయం తీసుకోలేదు: కిషన్ రెడ్డి
సెక్షన్ 8 పైన కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి షాకిచ్చారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.