బాలయ్యను కాదని లోకేశ్ కు మంత్రి పదవి: ఎన్టీఆర్ -హరికృష్ణను బాధ పెట్టారు : రోజా ఫైర్..!!
మంత్రి ఆర్కే రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బిల్లుపైన చర్చ సమయంలో చంద్రబాబు నందమూరి కుటుంబంతో వ్యవహరించిన తీరు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ తనయుడుగా ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణను కాదని, దొడ్డి దారిలో కొడుకు లోకేష్ ను మంత్రని చేసారని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయనకు అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా వేధించి..ఆయనతో కన్నీరు పెట్టించారని ఆరోపించారు.

హరికృష్ణ ను అవమానించారు
ఎన్టీఆర్ తో కలిసి చైతన్య రధం నడుపుతూ పార్టీ కోసం పనిచేసిన హరికృష్ణ ను ఏ విధంగా దూషించారో దేవినేని నెహ్రూ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసారని గుర్తు చేసారు. హరికృష్ణ కు రాజ్యసభ కూడా రెన్యువల్ చేయకుండా అవమానించారని రోజా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కు ఎన్టీఆర్ పైన ఉన్న గౌరవంతోనే అడగకుండానే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని చెప్పుకొచ్చారు. కక్ష్య సాధింపు చర్యలు చంద్రబాబుకు మాత్రమే తెలుసని.. రాష్ట్రంలో వైద్య రంగానికి సంబంధించి వైఎస్సార్ ను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీలో వైఎస్సార్ ఫొటో తీయించటంతో పాటుగా, విజయవాడలో వైఎస్సార్ విగ్రహం కూడా తొలిగించారని రోజా చెప్పారు.

అధికారం కోసం అందరినీ..
నాడు చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను రోజా సభలో ప్రస్తావించారు. చంద్రబాబు అధికారం కోసం అందరినీ వాడుకుంటారని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భవానికి ముందే ఎనిమిది మెడికల్ కాలేజీలు ఉండగా, వైఎస్సార్ హయాంలో మూడు కాలేజీలు వచ్చాయని చెప్పారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయని వివరించారు. ఈ కాలేజీలు అన్నీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయని, ఏపీలో పేదలకు వైద్యం దగ్గర చేయటంతో పాటుగా వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన వైఎస్సార్ పేరుతో ఈ యూనివర్సిటీ ఉండాల్సిన అవసరం ఉందని రోజా చెప్పుకొచ్చారు.

వైఎస్సార్ పేరుతో గౌరవించుకోవాలి
హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు ఎన్టీఆర్ ను అవమానించటం కాదని, వైఎస్సార్ ను గౌరవించటమని రోజా స్పష్టం చేసారు. ఎన్టీఆర్ పైన అంత అభిమానం ఉంటే వెన్నుపోటు ఎందుకు పొడిచారని రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావటం అద్భుతమని ప్రశంసించారు. చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదని రోజా పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా క్యాన్సర్ కు చికిత్స తో పాటుగా మొత్తంగా 2444 ప్రొసీజర్లకు చికిత్స అందిస్తున్నామని మంత్రి రోజా వివరించారు.












Click it and Unblock the Notifications