చంద్రబాబు రాష్ట్రానికి శకుని; అభివృద్ధిని అడ్డుకుంటూ రాక్షసానందం: మండిపడిన మంత్రి సీదిరి అప్పలరాజు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రతి సంక్షేమ పథకానికీ చంద్రబాబు అడ్డు పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి సంక్షేమ పథకానికీ కోర్టులకు వెళ్లి అడ్డుతగులుతున్నారంటూ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ హయాంలో మహిళలపై దాడులే జరగలేదా?
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశాడంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మహిళల అభ్యర్ధన మేరకే ప్రస్తుతం సీఎం జగన్ ఆ రుణాలను మాఫీ చేస్తున్నారని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాని చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అప్పలరాజు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అసలు మహిళలపై దాడులు జరగలేదు అంటూ ప్రశ్నించిన ఆయన వైసీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక, అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఉందని టీడీపీ దుష్ప్రచారం
2014 ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన చంద్రబాబు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్ మాఫియా ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీకి డ్రగ్స్ కి లింక్ పెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎన్ఐఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ కు అందులో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది అని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. కావాలనే డ్రగ్స్ వ్యవహారంలో జగన్ పేరు వాడుతున్నారని మండిపడ్డారు.
మహిళల సంక్షేమాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్న చంద్రబాబు
మహిళల హక్కులను సంక్షేమాన్ని అభివృద్ధిని కోర్టుల ద్వారా అడ్డుకోవడం చంద్రబాబుకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, ఇంగ్లీష్ మీడియం చదువులు ఇలా ప్రతి ఒక్క దానిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు అంటూ, టీడీపీ వాళ్ళతో కోర్టులలో కేసులు వేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రం పాలిట శకునిలా తయారయ్యారని మంత్రి మండిపడ్డారు. పేదలందరికీ ఇళ్ళు ఇస్తుంటే తట్టుకోలేక చంద్రబాబు అండ్ కో కోర్టులో స్టే లు తెచ్చి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.
అభివృద్ధిని అడ్డుకుంటే బాబుకు పతనం తప్పదు
వైయస్సార్ సిపి నాయకులు కేసులు వేశారని వితండవాదం చేస్తున్న చంద్రబాబుకు అసలు సిగ్గు శరం ఉన్నాయా అంటూ మంత్రి అప్పలరాజు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతీ చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కుట్రలు కుతంత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టించి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే చంద్రబాబుకు మళ్లీ జనం బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రైతు భరోసా ఇవ్వమని ప్రకటిస్తూ, నవరత్నాలను ఇవ్వమని దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్ విసిరారు.
Recommended Video
మహిళలను అవమానిస్తే అధః పాతాళానికే
మహిళలను అవమానించిన వారు బాగుపడరని, మహిళలను అవమానించిన చంద్రబాబును ఇప్పటికే అథఃపాతాళానికి తొక్కేశారని మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. ముందు ముందు చంద్రబాబును ఆదరించే వారు ఎవరూ ఉండరని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే కేంద్రానికి నివేదిక సమర్పించామని మంత్రి స్పష్టం చేశారు.