నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పని లేదు: సభలో బల్లను చరచడంపై సుజనా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా సాధిస్తామన్న నమ్మకం ఉందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని అన్నారు. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే హోదాపై కాంగ్రెసా పార్టీ రాద్దాంతం చేస్తోందని విమర్శించారు.
రాజకీయాలు ఆపి అందరం సమిష్టిగా కృషి చేస్తేనే ఏపీకి హోదా లభిస్తుందని ఆయన చెప్పారు. ఏపీకి హోదాపైనే అందరూ మాట్లాడుతున్నారని, హోదా రావాలంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ఆయన సూచించారు. రాష్ట్రం కోసం అన్ని రకాలుగా కష్టపడుతున్నామని ఆయన తెలిపారు.
హోదా కోసం ప్రతిపక్షాలు రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ధర్నా చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. కాబట్టి ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని, అవసరమైతే ఢిల్లీకి వచ్చి మాట్లాడాలని ఆయన అన్నారు. రాజకీయాలు ఆపి అందరం సమిష్టిగా ప్రయత్నిస్తేనే రాష్ట్రాలని లాభం చేకూరుతుందని చెప్పారు.
ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి మెడికల్ సీటు అడగలేం కదా అని ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రింబవల్లు కష్టపడుతున్నారని చెప్పిన సుజనా, హోదాతో పాటు విభజన హామీల అమలు కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
దానిని ప్రోత్సహించాల్సింది పోయి ప్రతిపక్షాలు వెనక్కి గుంజాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రజల కోసమే చంద్రబాబు అహర్నిశలూ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల ఆకాంక్షను ఎప్పటికప్పుడు ఢిల్లీలో వినిపిస్తున్నామని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి రెండు రోజుల ఢిల్లీ పర్యనటపై కూడా ఆయన స్పందించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో అందరు మంత్రులు ఏపీ పట్ల సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రధాని మోడీ సైతం ఏపీ పట్ల సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఏపీ సమస్య నా సమస్య అని మోడీ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఈ మేరకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారని, వాటిని నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని అన్నారు. కాంగ్రెస్ తలచుకుంటే మొన్న జీఎస్టీ బిల్లు సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై మాట్లాడి ఉంటేదని ఆయన చెప్పారు. హోదాపై కాంగ్రెస్ పార్టీ ద్వంద ప్రమాణాలను పాటిస్తోందని మండిపడ్డారు.
సుజనా 'నాట్ కరెక్ట్..' వెళ్లింది హోదా కోసం కాదు : చంద్రబాబు
నాబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సాయం చేసేందుకు ముందుకొచ్చిందని ఆయన వివరించారు. ఏపీకి హోదా కల్పించాలని రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లును ఆర్థిక బిల్లా కాదా అన్న అంశం లోక్ సభ స్పీకర్ తేలుస్తారని స్పీకర్ కురియన్ ప్రకటించడంతో.. దానిపై హర్షం వ్యక్తం చేస్తూ సుజనా బల్లలు చరిచిన దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై కూడా సుజనా చౌదరి స్పందించారు. ఏపీకి హోదా విషయంలో నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. రాజ్యసభలో చప్పట్లు కొట్టారా లేక బల్లలు చరిచారా అనే దానిపై పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.