కొత్త మంత్రివర్గంలో శాఖలమార్పుపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ; పవన్ కళ్యాణ్; చంద్రబాబులపై ఫైర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గంలో శాఖల మార్పులు ఉంటాయని రెండు రోజుల నుంచి పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఇక మంత్రివర్గంలో శాఖల మార్పుపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలో శాఖలు మారుస్తున్నారని సమాచారం తమకు లేదని ఆయన వివరణ ఇచ్చారు. తనకు అప్పగించిన మున్సిపల్ శాఖ బాధ్యతలు స్వీకరించినట్లుగా పేర్కొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షలు కూడా ప్రారంభించామని వెల్లడించారు.

మంత్రివర్గంలో శాఖల మార్పుపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ వారి కుటుంబంలో జరుగుతున్న వివాహ పనుల్లో బిజీగా ఉండటంవల్ల మంత్రిగా బాధ్యతలు స్వీకరించటంలో కాస్త జాప్యం జరిగిందని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారని పేర్కొన్న ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పని చేస్తానని వెల్లడించారు.

బాలినేనితో విబేధాలు లేవు.. కలిసి పని చేస్తానన్న ఆదిమూలపు సురేష్
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని బాలినేని ఆధ్వర్యంలో కలిసి పని చేస్తానని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంత్రి పదవుల విషయం స్వయంగా జగన్మోహన్ రెడ్డి చూసుకున్నారని, బాలినేనికి పార్టీ పదవిని కేటాయిస్తారని ఆయన పేర్కొన్నారు. మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల ఆదరణ మాత్రం తమకు ఎప్పటికీ ఉంటుందని ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాత మంత్రివర్గంలో తామంతా రాజీనామా చేసిన తర్వాత అవసరం అనుకున్న చోటే మళ్లీ మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించారని ఆదిమూలపు సురేష్ తెలిపారు. అంతే తప్ప తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడంలో ఇతర కారణాలేవీ లేవు అని వెల్లడించారు.

జగన్ చెప్పని విషయం చంద్రబాబుకు ఎలా తెలుసు?
వైసీపీలో ఉన్న తామంతా జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన వారేనని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంత్రి పదవి రాని వారంతా ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నారు అని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. క్యాబినెట్ మొత్తాన్ని మారుస్తామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని మొత్తం క్యాబినెట్ మారుస్తారని సీఎం జగన్ చెప్పినట్టుగా చంద్రబాబు చెబుతున్నారని, జగన్ చెప్పని విషయం చంద్రబాబుకు ఎలా తెలుసు అంటూ ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా ఏపీ క్యాబినెట్ లో ఉన్నారా అంటూ ప్రశ్నించిన ఆదిమూలపు సురేష్ చంద్రబాబులో అభద్రతాభావం పెరిగిందని మండిపడ్డారు.

ఎవరో ఒకరి పల్లకీ మోయడమే పవన్ కళ్యాణ్ అజెండా
ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ ఆదిమూలపు సురేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఒక జెండా, అజెండా రెండు లేవని విమర్శించారు. ఎవరో ఒకరి పల్లకీ మోయడమే పవన్ కళ్యాణ్ అజెండా అంటూ విరుచుకుపడ్డారు. అందుకే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా వాటన్నింటినీ గంపగుత్తగా వేరే వారికి అప్పగిస్తామని సిద్ధాంత ధోరణి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. ఇక దీనిని ఎవరైనా పార్టీ సిద్ధాంతం అంటారా అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications