ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్: 'తెలుగు రాష్ట్రాల సీఎంల తీరు బాలేదు'
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజకీయ వివాదాలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తొలిసారి స్పందించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్వవహరిస్తున్న తీరు బాగాలేదని అన్నారు.
నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమంలో ఈరోజు వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో పోటీపడాలి తప్ప వివాదాలు పెంచుకోవద్దని సూచించారు. కొందరు మంత్రులు సంయమనం పాటించట్లేదని, గవర్నర్ను కించపరిచేలా మాట్లాడటం తగదని అన్నారు.
అనవసర వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు వెంకయ్య సూచించారు. వివాదాలు చట్టానికి వదిలేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఇక స్వర్ణభారతి ట్రస్టులో పదోతరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వెంకయ్య పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్రూడీ, మంత్రి నారాయణ, తదితరులు పాల్గొన్నారు. గత రెండు వారాల నుంచి తెలుగు రాష్ట్రాల మద్య వివాదం నడుస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు.
అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడం, పోలీసుల కేసులు, నోటీసులతో దూకుడు పెంచడంతో కేంద్ర జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా వివాదం కాస్తంత సద్దుమణిగినట్టు కనిపిస్తోంది.