గుంటూరు జీజీహెచ్ లో మంత్రి విడదల రజిని ఆకస్మిక తనిఖీ.. అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్న విడదల రజిని ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఆరోగ్య యజ్ఞంలో దివ్యౌషధం అవుతానని, సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా అని, గుంటూరును మెడికల్ హబ్ గా చేస్తా అని పేర్కొన్న మంత్రి విడదల రజిని రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో సందర్శనలు మొదలుపెట్టారు.

గుంటూరు జీజీహెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి విడదల రజిని
బుధవారం నాడు గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ ను హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబు తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని పరుగులు పెట్టించారు. మంత్రి ఆకస్మిక తనిఖీతో అధికారులకు చెమటలు పట్టించారు. ఆకస్మికంగా ఆసుపత్రి సందర్శనకు వెళ్లిన విడదల రజినీ నేరుగా పేషెంట్ల వద్దకు వెళ్లి ఆసుపత్రిలో అందుతున్న వైద్యం తీరుతెన్నులను గురించి అడిగి తెలుసుకున్నారు.

అత్యవసర విభాగంలో ఏసీ పని చెయ్యకపోవటంపై అధికారులపై ఆగ్రహం
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లోని ప్రతి డిపార్ట్మెంట్ ను పరిశీలించిన మంత్రి అక్కడి పరిస్థితులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే సమయంలో అత్యవసర విభాగం లో ఏసీ పనిచేయడం లేదని గుర్తించిన మంత్రి విడదల రజిని, దానిపై అక్కడి అధికారులను వివరణ అడిగారు. ఆరు నెలల నుండి ఏసీ పని చేయకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఎలక్ట్రికల్ విభాగం ఏఈని ప్రశ్నించారు.

విధుల్లో వైద్యులు లేరని గుర్తించి ఉన్నతాధికారులను వివరణ అడిగిన మంత్రి
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి విడదల రజిని తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికప్పుడు రిపేర్ బిల్స్ ఇస్తున్నామని చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, బిల్స్ ఇస్తున్నప్పటికీ ఎందుకు రిపేర్ చేయించలేదు అంటూ ఆసుపత్రి అధికారులను ప్రశ్నించారు. అంతేకాదు ఆసుపత్రిలో చాలామంది వైద్యులు విధుల్లో లేరని గుర్తించిన మంత్రి విడదల రజిని దీనిపై ఉన్నతాధికారులను ప్రశ్నించారు.

విధుల్లో నిర్లక్ష్య వహిస్తే సహించబోమని చెప్పిన మంత్రి విడదల రజిని
విధుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎందుకు లేరని జీజీహెచ్ లో ఉన్న ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి విడదల రజిని. అయితే పీజీలు మాత్రమే విధుల్లో ఉన్నారని అధికారులు మంత్రికి వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా పీజీ లతోనే ఆసుపత్రిని నడిపిస్తున్నారా అంటూ మంత్రి విడదల రజిని ప్రశ్నించారు. ఈసారి మళ్లీ విజిట్ కి వచ్చే సమయానికి అన్నీ సక్రమంగా ఉండాలని, లేదంటే ఉపేక్షించేది లేదని మంత్రి విడదల రజిని గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉన్నతాధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications