వైసీపీ ఎంపీ రాజీనామా-మహిళా మంత్రికి ఛాన్స్ -మళ్లీ ఇన్ ఛార్జ్ మార్పు ?
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు చేర్పులు అధిష్టానానికి ఓవైపు తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో మరోవైపు సిట్టింగ్ ప్రజాప్రతినిధుల రాజీనామాలు చికాకు పెడుతున్నాయి. దీంతో సీఎం జగన్ ఇన్ చార్జ్ ల మార్పు ఐదో జాబితాపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో చేపట్టిన మార్పుల వల్ల తలెత్తిన ఇబ్బందులతో పాటు సిట్టింగ్ ల తాజా రాజీనామాల్ని ఒకేసారి కౌంటర్ చేసేందుకు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.
వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడదల రజనీని అక్కడి నుంచి గుంటూరు పశ్చిమ సీటుకు మార్చారు. దీంతో ఆమె అక్కడ పనిచేసుకోవడం మొదలుపెట్టేశారు. అయితే తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా వెళ్లాలని అధిష్టానం కోరడం, దానికి నిరాకరిస్తూ ఆయన రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఐదో జాబితాలో నరసరావుపేట సీటుపై దృష్టిసారించారు.

ఇందులో భాగంగా నరసరావుపేట ఎంపీ సీటులో మంత్రి విడదల రజినీని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నరసరావుపేట ఎంపీ స్ధానంలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ కు అవకాశం ఇవ్వాలని ప్రయత్నించినా ఆయన గెలిచే అవకాశాలు లేవని తేలిపోవడంతో వైసీపీ దృష్టి ఇప్పుడు మంత్రి విడదల రజనీపై పడింది. ఇప్పటికే గుంటూరు పశ్చిమ సీటుకు మార్చిన రజనీని తిరిగి నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలున్నాయి. అదే జరిగితే వైసీపీ ఇన్ చార్జ్ ల మార్పుల్ని వెనక్కి తీసుకున్న తొలి నియోజకవర్గంగా గుంటూరు పశ్చిమ నిలవబోతోంది.












Click it and Unblock the Notifications