పల్నాడులో మంత్రి విడదల రజినికి షాకిచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు; అధికారులపై మంత్రి ఫైర్
పల్నాడు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ నేతల మధ్య పొసగడం లేదన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన విడదల రజినికి మధ్య వర్గ విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు అవి చిలికి చిలికి గాలి వానగా మారి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మంత్రి విడదల రజినీకి ఎంపీ షాక్ ఇచ్చారు.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ప్రారంభించారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేరు లేకపోవడంతో, ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. శిలాఫలకం పైన తన పేరు లేకపోవడంపై మంత్రి విడదల రజని అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఈ వివాదం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో మంత్రి విడదల రజిని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం ఉంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్థానికంగా చర్చనీయాంశం కాగా, తాజాగా ప్రోటోకాల్ వివాదం కూడా చోటు చేసుకోవడంతో వీరి మధ్య గొడవలు పీక్స్ కి చేరాయి అన్న టాక్ వినిపిస్తుంది.
విడదల రజనికి, శ్రీకృష్ణదేవరాయలకు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగానే శిలాఫలకం పైన విడదల రజిని పేరు వేయలేదని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికలలో జగన్ ను గద్దె దించాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ పెద్ద ఎత్తున వైసీపీని టార్గెట్ చేస్తుంటే, రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల సొంత పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు జగన్ కు తలనొప్పిగా మారాయి.

వైనాట్ 175 అంటూ జగన్ ఎన్నికలకు రెడీ అవుతుంటే పార్టీ నేతల కుమ్ములాటలు మాత్రం జగన్ ఆలోచనలకు సంబంధం లేకుండా సాగుతున్నాయి. ముందు ముందు ఈ వివాదాలు ఇలాగే కొనసాగుతాయా? లేక జగన్ ఆధిపత్య పోరు కొనసాగుతున్న నియోజకవర్గాలపై దృష్టి సారించి వారి మధ్య సమస్యలను పరిష్కరించి, అందరినీ ఏకతాటి మీదికి తీసుకువస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications