నా ఇల్లు అంటిస్తారా ..మీ అంతు చూస్తా : మంత్రి తనయుడి వార్నింగ్ - ఆడియో వైరల్..!!
మంత్రి కుమారుడు..సొంత పార్టీ ఎంపీటీసీని హెచ్చరిస్తూ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. అమలాపురంలో జరిగిన అల్లర్ల సమయంలో మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ వ్యవహారం పైన అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామ వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబుకు మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి ఫోన్ చేసారు. ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో తన తల్లి తృటిలో తప్పించుకున్నారని మంత్రి తనయుడు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు విశ్వరూప్ అమాయకత్వాన్నే చూశావు, కృష్ణారెడ్డి దమ్ము చూడలేదు అంటూ హెచ్చరించారు.
తగలేయడానికి ఎవరిచ్చార్రా ధైర్యం
మా బాబు (విశ్వరూప్) పాముకు పాలుపోసి పెంచినట్లు నిన్ను పోషించాడు. మీ ఇంట్లో మీ అమ్మని, పెళ్లాన్ని పెట్టి పెట్రోలు పోసి తగలేస్తే ఏం చేస్తావు అంటూ ప్రశ్నించారు. ఇంట్లో పిల్లల్ని, భార్యల్ని తగలేయడానికి ఎవరిచ్చార్రా ధైర్యం .. దమ్ముంటే తగలెట్టేయడానికి 4వేల మంది కాదు.. 10వేల మంది రండిరా.. నేను ఇంట్లోనే ఉంటాను అంటూ సవాల్ చేసారు. మీ వల్ల మా అమ్మ చచ్చిపోయుండేది. నా అమ్మను మీరు తగలెట్టేద్దురు. మా అమ్మ చచ్చిపోయి ఉంటే.. నా బాబును చంపేద్దును. జిల్లాకు ఎవరి పేరు పెడితే మీకెందుకురా అంటూ హెచ్చరించారు.
చంద్రబాబు అడిగారా లేదా
కోనసీమ జిల్లా అంబేడ్కర్ జిల్లా అయితే నీకేంటి అంటూ ప్రశ్నించారు. నీకొచ్చిన నాలుగు రూపాయలు పోయిందా అంటూ నిలదీసారు. రాసుకో.. నిన్ను వదలను, ఈ రెండేళ్లు ఏం చేస్తానో చూడు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మా నాన్న మాట కూడా వినను... నిన్ను చంపేస్తానంటూ కృష్ణారెడ్డి హెచ్చరించారు. 15 రోజుల కిందట చంద్రబాబు వచ్చి అంబేడ్కర్ జిల్లా ఇవ్వాలన్నారా.. లేదా అని ప్రశ్నిస్తూనే.. అదే చంద్రబాబుకు పవన్కల్యాణ్ వత్తాసు పలుకుతున్నారా.. లేదా అంటూ.. మరి మీరెందుకు వెళ్లారని నిలదీసారు.
మంత్రి కుమారుడి ఆడియో వైరల్
దీనికి స్పందనగా తాను ఆ రోజు ఆందోళనలో వినతిపత్రం ఇచ్చేందుకే వెళ్లానని..మంత్రి ఇంటి దగ్గర జరిగిన గొడవతో తనకు సంబంధం లేదంటూ సత్తిబాబు చెబుతున్నా.. ఆయన వాదన వినిపించుకోవటం లేదు. ఇప్పటికే ఈదరపల్లి ఎంపీటీసీ అడపా సత్తిబాబు అమలాపురం అల్లర్ల కేసులో నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం సత్తిబాబు పరారీలో ఉన్నారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ వ్యవహారంతో పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.