దూసుకొస్తోంది, కుండపోత వర్షాలు- ఫ్లాష్ ఫ్లడ్స్..ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా తాజాగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. పలు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని మంత్రులు సూచించారు. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల పైన తాజా హెచ్చరికలు జారీ అయ్యాయి.
బంగాళాఖాతం-ఉత్తర శ్రీలంక మధ్య అల్పపీడనం కొనసాగుతుందని.. రాష్ట్రానికి వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోం మంత్రి అనిత ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు. సహయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలిస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

వర్షాలు...పిడుగుల పైన ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ మెసేజ్ లు పంపాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. ప్రజలు సురక్షిత మైన భవనాల్లో ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇక కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి నెల్లూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications