బాబుపై వ్యాఖ్యలు: జగన్తో పాటు ప్రశాంత్ కిశోర్ సైతం టార్గెట్
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు కూడా దిగుతున్నారు. జగన్ను మాత్రమే కాకుండా ప్రశాంత్ కిశోర్ను కూడా వారు టార్గెట్ చేశారు.
జన్మలో ముఖ్యమంత్రి పదవి దక్కదనే అక్కసుతో జగన్మోహన రెడ్డి ఉన్మాదిగా మారారని, రోజురోజుకు జగన్ ఉన్మాదం తారాస్థాయికి చేరుతోందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పదవి దక్కలేదనే రాష్ట్రానికి, ప్రజలకు కీడు చేసేందుకు కూడా వెనుకాడడం లేదని అన్నారు. సభ్య సమాజానికే తలవంపులుగా జగన్ మారారని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య విలువలకు,రాజ్యాంగ ఔన్నత్యానికి జగన్ కళంకం తెస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని చెప్పుతో కొట్టమనడం, కాల్చిచంపమనడం, ఉరితీయమనడం గతంలో మనం విన్నామా? కన్నామా? అని ఆయన ప్రశ్నించారు.

పికె చెప్పినట్లున్నారు..
ఎన్ని తిట్లు తిడితే అన్ని ఓట్లు పడతాయని కన్సల్టెంట్ పీకే చెప్పినట్లున్నారు గానీ ఎన్ని తిట్లు తిడితే అన్నివేల ఓట్లు పోతాయనేది తెలుసుకోవాలని యనమల రామకృష్ణుడు అన్నారు. ఉన్మాదంగా వ్యవహరిస్తున్న జగన్మోహన రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా తగడని అభిప్రాయపడ్డారు. ఇంత ఉన్మాదం,విపరీత ధోరణి ఉన్న ఏనాయకుడినీ తన రాజకీయ జీవితంలో ఇంతవరకు చూడలేదన్నారు.

జగన్ స్వయంగా అంగీకరించారు....
ముఖ్యమంత్రిని కాల్చి చంపినా తప్పులేదని తాను అన్నమాట నిజమేనని జగన్ స్వయంగా అంగీకరించారని యనమల అన్నారు. ఇంతకన్నా సాక్ష్యం ఎన్నికల సంఘానికి ఇంకేమి కావాలిని అడిగారు. ఎన్నికల సంఘం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నేరం చేసినవాళ్లపై సకాలంలో చర్యలు తీసుకోకపోతే ఆ నేరగాడు మరింత పెచ్చుమీరి మరిన్ని నేరాలకు పాల్పడతాడనేది ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. కాల్చిచంపమని అన్నప్పుడే సరైన చర్య తీసుకుని ఉంటే ఇప్పుడు ఉరితీయమనే వ్యాఖ్యలు చేసేవారు కాదని, ఉదాసీనంగా వ్యవహరిస్తే నేరగాళ్లు పేట్రేగి పోతారని అన్నారు.

తీవ్రవాదిలా, ఉగ్రవాదిలా...
మావోయిస్టులు, తీవ్రవాదులు,ఉగ్రవాదులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు గతంలో చేయలేదని యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్మోహన రెడ్డి వారిని మించిపోయారన్నారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ర్చ,బీహార్ లో గతంలో విద్వేష ప్రసంగాలు చేసిన నాయకులకు ఏమైందో చూశామని అన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన నేతలు గతంలో 20రోజులు జైలుకెళ్లి బెయిల్ పై బయటకి వచ్చారనేది గుర్తుంచుకోవాలని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి ఉన్మాద నాయకులకు, పార్టీకి చోటులేదని అన్నారు.

శవాన్ని పక్కన ఉంచుకుని...
ముఖ్యమంత్రిని కాల్చిచంపితే , ఉరితీస్తే సీఎం కుర్చీ దక్కుతుంది అనుకోవడం అమానవీయం, దానవత్వానికి పరాకాష్ట అని యనమల అన్నారు. శవం పక్కనే ఉంచుకుని సంతకాలు సేకరించినా ముఖ్యమంత్రి పదవి దక్కని అనుభవం జగన్మోహన రెడ్డికి ఉందని అన్నారు. శత్రువును కూడా ప్రాణాలు తీయాలని,పోవాలని ఎవరూ కోరుకోరని అంటూ అలాంటిది సాక్షాత్తూ రాష్ట్రాధినేతను,ప్రభుత్వాధినేతనే కాల్చి చంపాలని,ఉరితీయాలని విద్వేష వ్యాఖ్యలు చేసేవారిని ఏం చేయాలి? ఏవిధంగా శిక్షించాలి? ఏ నేరం నమోదు చేయాలి? ఏ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలనేది ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ,పోలీసు అధికారులే నిర్ణయించాలని అన్నారు.

సభ్య సమాజంలో ఉండనేరరు...
సభ్యసమాజంలో ఉండే అర్హతను జగన్ కోల్పోయారని యనమల అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ఉండే కనీస లక్షణం ఒక్కటి కూడా జగన్కు లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయనిమచ్చగా మారారని, రాజ్యాంగానికే తీరని కళంకం అయ్యారని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించారని, శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమించారని మండిపడ్డారు. ఇటువంటి వాళ్లు ప్రజాప్రతినిధిగా తగరని, పార్టీ అధ్యక్షునిగా ఉండటానికే అనర్హు లని అన్నారు. ఇటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం ద్వారా వైకాపా నేతలు తమను తాము అవమానించుకోవడమే కాదు, రాష్ట్ర ప్రజలనే అవమానిస్తున్నారని విమర్శించారు.

ఇలా కుట్రలు చేస్తున్నారు...
కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను వాయిదా వేయించడానికి టిడిపి కుట్ర చేస్తున్నట్లుగా వైకాపా నేతలు, వారి బాకా మీడియా ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నామని యనమల అన్నారు. సాక్షి జిల్లా పత్రికలో ప్రచురించిన కార్డూన్ పై, కథనంపై ప్రెస్ కౌన్సిల్ కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

జగన్ మూర్ఖుడు...
జగన్ అన్నింటికీ తెగించిన మూర్ఖుడని మంత్రి పత్తిపాటి పుల్లారావు చిలుకలూరిపేటలో అన్నారు. ఎన్నికల కమీషన్ నోటీసులు ఇచ్చినా జగన్ భాషలో మార్పు రాలేదని మంత్రి పుల్లారావు అన్నారు. జైలు శిక్ష అనుభవించి 12 కేసులలో ముద్దాయిగా ఉన్నాను...ఇంతకన్నా ఇంకేమి చేస్తారులే అనే తెగింపుతోనే ముఖ్యమంత్రిపై ఇలా అగౌరవంగా మాట్లాడుతున్నాడని అన్నారు.

జగన్ ఓ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడు
వైసీపీ నేత జగన్ ది సైకో మనస్తత్వం అని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అన్నారు.మానవత విలువలు లేని ఓ క్రిమినల్ జగన్. ప్రపంచంలో అత్యంత కిరాతకులలో జగన్ ఒకరు.తన లాగే అందరు అరాచకాలు - అక్రమాలు చేస్తారని ఆయన భావిస్తున్నాడని అన్నారు. జగన్ కు అరుదైన మానసిక రోగం ఉందని వ్యాఖ్యానించారు. అధికారం ఎప్పటికీ రాదని తేలడంతో ఆ మానసిక రోగం బాగా ముదిరిందని, భూమి మీద ఉన్న వైద్యులు ఎవ్వరూ జగన్ రోగానికి మందు కనిపెట్టలేదని దుమ్మెత్తిపోశారు. జగన్ రోగానికి దేవుడే త్వరలో సరైన మందు ఇస్తాడు.జగన్ లాంటి నేతలు ఎందరో కాలగర్బం లో కలిసిపోయారని ఆయన అన్నారు.

మీ తండ్రిని.
ఉన్మాదిలా వ్యవహరిస్తే భగవంతుడు ఎలా శిక్షిస్తాడో మీ తండ్రి, తాతలు చరిత్ర చూసుకో అని యరపతనేని శ్రీనివాస్ రావు అన్నారు. చంద్రబాబు ఎంట్రుక కూడా జగన్ పీకలేడని, వైఎస్ కొడుకు కాకపోతే జగన్ బతుకు గుడిసె బతుకే అయ్యేదని ఆయన అన్నారు. సాక్షి పత్రిక , ఛానల్ ఎవరివో తేల్చి జగన్ చెప్పాలని యరపతినేని డిమాండ్ చేశారు.

ప్రశాంత్ కిశోర్ కుట్ర
టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే వ్యూహంతో ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ నాకుడు వర్ల రామయ్య అన్నారు .ప్రశాంత్ కిషోర్, జగన్ చేసే పనులపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. జగన్ లాగే ప్రశాంత్ కిషోర్ కి క్రిమినల్ చరిత్ర ఉందని, ప్రశాంత్ కిషోర్ పై ఉత్తరప్రదేశ్ లో ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని రామయ్య అన్నారు.యూపీ అఖిలేష్ యాదవ్ని మోసం చేసి ఏపీకి పారిపోయి వచ్చాడని అన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడని అన్నారు. జగన్, ప్రశాంత్ కిషోర్ లపై డీజీపి నిఘా పెట్టాలని కోరారు. ప్రశాంత్ కిషోర్ జట్టులో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో తెలుసుకోవాలని, ఇద్దరూ కలిసి ఏదో కుట్ర చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని, కుట్రని అడ్డుకోవాలని వర్ల రామయ్య అన్నారు.

జగన్ దిష్టి బొమ్మకు ఉరి వేశారు...
నారా చంద్రబాబు నాయుడిని ఉరితీయాలంటూ జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో టి.ఎన్. ఎస్ ఎఫ్, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నమైన నిరసన కు దిగారు. జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని గుంటూరు జిల్లా తెలుగుయువత నాయకుడు రావిపాటి సాయి కోరారు.
వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉరితీయాలంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ కేవలం అధికార దాహంతో చంద్రబాబు ని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలుగు యువత నాయకులు విమర్శించారు. ఆయన తలక్రిందులా తపస్సు చేసినా ముఖ్యమంత్రి కాలేడని అన్నారు. జగన్ దిష్టి బొమ్మను వర్శిటీ ప్రాంగణంలో ఉరేగించి శవయాత్రగా వర్శిటీ మెయిన్ గేటు వద్దకు తీసుకు వచ్చి చెట్టుకు ఉరి తీసి వైసీపీ పార్టీ, జగన్ వ్యవహారాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications