చిక్కుల్లో అశోక్ గజపతిరాజు: సంజయ్ భండారితో ఓస్డీకి లింక్స్
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందినట్లు భావిస్తున్న ఇంటిని కొన్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ వ్యవహారంలో పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఓఎస్డీ అప్పారావు పేరు వెలుగులోకి వచ్చింది.
ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ఆర్థిక వ్యవహారాలపై జరుగుతున్న చర్చ దాంతో కొత్త మలుపు తిరిగింది. అప్పారావు ఫోన్ కాల్స్ విషయంలో ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. భండారీ ఇంట్లో విచారణ సంస్థలు ఇటీవల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిరుడు అప్పారావుతో భండారీ ఫోన్లో 355 సార్లు మాట్లాడినట్లు విచారణలో తేలినట్లు చెబుతున్నారు.
తనకు భండారీ ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, అయితే చాలా తక్కువసార్లు ఫోన్ చేసినందున ఆ నెంబరును తాను గుర్తు పెట్టుకోలేదని అప్పారావు అంటున్నారు. మంత్రిని కలిసేందుకు భండారీ ఏడాదిన్నర కాలంలో మూడు, నాలుగు సార్లు ఇంటికి వచ్చారని, అయితే విమానయాన పరికరాల వ్యాపారంలో ఉన్నందుకే మంత్రి ఆయనతో మాట్లాడారని చెప్పారు.
ఏడాదిన్నర క్రితం బెంగళూరులో జరిగిన ఎయిర్షోలో అశోక్ గజపతి రాజును భండారీని కలిసినట్లు చెప్పారు. అది వృత్తిపరమైన భేటీయే తప్ప తప్పుడు పనుల కోసం కాదని ఆయన ఓ ప్రైవేట్ టీవీ చానెల్తో అన్నారు. కాగా, భండారీతో తనకు వ్యక్తిగతమైన పరిచయమే తప్ప వృత్తిపరమైన సంబంధాలు లేవని బిజెపి నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ చెప్పారు.
లండన్లోని వాద్రాకు చెందినట్లుగా భావిస్తున్న ఇంటిని 2009లో భండారీ కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. బ్యాంకు ఖాతాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) భండారీకి నోటీసులు జారీ చేసింది.