చంద్రబాబు వల్లే ఉన్మాదిలా పవన్ కళ్యాణ్: మంత్రులు అంబటి, రోజా హాట్ కామెంట్స్
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో కళ్యాణోత్సవ సేవలో మంత్రి రోజా, సెల్వమణి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
చంద్రబాబు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అంటూ రోజా
చంద్రబాబు కళ్లు ఉన్న కబోది అని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రోజా. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్లే.. అభివృద్ధి జరగడం లేదని విమర్శిస్తున్నారని రోజా మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఏం ఉద్ధరించడానికి వెళ్లారంటూ రోజా ఫైర్
ఇప్పటంకు పవన్ కళ్యాణ్ ఏం ఉద్ధరించడానికి వెళ్లారని ధ్వజమెత్తారు. అక్కడి ప్రజలకు ఆరు నెలల ముందే నోటీసులు ఇవ్వడం జరిగిందని, దానికి ప్రజలు అంగీకారం తెలిపారన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. అక్కడ రోడ్లు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. దాన్ని పవన్ అడ్డుకుంటున్నారన్నారు. గత ఐదేళ్ల అభివృద్ధి.. ఈ మూడేళ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
చంద్రబాబు సలహాలతో ఉన్మాదిలా పవన్ కళ్యాణ్: అంబటి
మరోవైపు మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ ఉన్మాదిలా మాట్లాడారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బాలి అన్న ఒక్క మాట ఆయనలోని ఫ్రస్ట్రేషన్ ను బయటపెడుతోందన్నారు. ఈనాడు రాతలను పట్టుకుని, చంద్రబాబు సలహాలతో ఇప్పటం వచ్చి రంకెలు వేసి వెళ్లారని పవన్పై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబుపై దాడి, పవన్పై రెక్కీ ఫేక్ అంటూ అంబటి
ఇప్పటంలో ఏ ఇళ్లూ, ఏ విగ్రహం కూడా తొలగించలేదని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై రాయి వేయడం, పవన్ పై రెక్కీ అనేవన్నీ అవాస్తవాలన్నారు. పవన్ రాజకీయాలకు పనికివచ్చే మనిషికాదన్నారు. పవన్ కళ్యాణ్ తో వెళితే.. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని పవన్ అభిమానులకు అంబటి సూచించారు.