ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రయల్స్-500 మంది నుంచి శాంపిల్స్-వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా విరుగుడు పేరుతో ఇస్తున్న నాటు మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆనందయ్య మందుపై ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం ఏర్పడిందని... అయితే దాన్ని శాస్త్రీయంగా నిర్దారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయుష్,ఐసీఎంఆర్లను ఆ మందుపై అధ్యయనం చేయాల్సిందిగా కోరారని చెప్పారు.
500 మంది శాంపిల్స్...
ఆనందయ్య మందుపై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తాజాగా టీటీడీ ఆయుర్వేద కాలేజీకి ఒక నివేదిక పంపించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ ఎంతమందికి ఆనందయ్య మందు ఇచ్చారో తెలుసుకుని... వారిలో 500 మంది శాంపిల్స్ తీసుకోనున్నట్లు తెలిపారు. వారిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అన్నది నిర్దారించి నివేదిక పంపించాల్సిందిగా ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (సీసీఆర్ఏఎస్) ఆదేశించినట్లు చెప్పారు. వారం రోజుల్లోగా దీనిపై నివేదిక అందజేసే అవకాశం ఉందన్నారు.
క్లినికల్ ట్రయల్స్...
ఆనందయ్య మందుకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కూడా చేపట్టాలని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆదేశించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయుష్ ఆదేశాలను బట్టి మనుషులపై లేదా జంతువులపై క్లినికల్ ట్రయల్స్ ఉంటాయన్నారు. ఇప్పటికే టీటీడీ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఆనందయ్య మందుపై అధ్యయనం మొదలైందని... మందు తీసుకున్నవారిలో 500 మంది డేటాను సేకరిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా త్వరగా రిపోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నివేదికపై ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకునే నిర్ణయం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
Recommended Video
హైకోర్టులో పిటిషన్
మరోవైపు ఆనందయ్య నాటు మందుపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ అనుమతి కోసం హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని, ఈ మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేయడం వల్ల ఎంతోమంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. హౌస్ మోషన్ పిటిషన్ విచారణకు అనుమతించాలని కోరారు.ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఇప్పటికే ఆయుష్ తేల్చిన సంగతి తెలిసిందే. ఇక ఐసీఎంఆర్ నివేదిక ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.